ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 19 ప్రజాపాలన ప్రతినిధి *కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ

Published: Friday January 20, 2023

రాష్ట్రములో అంధత్వన్ని నిర్మూలించే దిశగా చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగు అని రాష్ట్ర విద్యశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు.
గురువారం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం, జిల్లెలగూడలోని అంబేద్కర్ నగర్ బస్తీలోని అంబేద్కర్ భవనములో ఏర్పాటు చేసిన రెండవ విడుత కంటివెలుగు కార్యక్రమమును రాష్ట్ర విద్యశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే మరెక్కడా లేనివిధంగా, గిన్నిస్ రికార్డును నమోదు చేసే తరహాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఆలోచనాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగు అన్నారు. దృష్టి లోపంతో ఎవరు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి రాష్ట్ర వ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రములో అంధత్వన్ని నిర్మూలించేందుకు గౌరవ ముఖ్య మంత్రి కెసిఆర్ కంటి వెలుగు కార్యక్రమమును ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ప్రస్తుత సమాజంలో సామాజిక రుగ్మతగా మారిన కంటి సమస్యను పారద్రోలాలనే కృత నిశ్చయంతో 2018 లోనే కంటి వెలుగుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి గుర్తు చేశారు. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 50 లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహిస్తే, మూడొంతుల మంది కంటి జబ్బులతో బాధ పడుతున్నారని నిర్ధారణ అయ్యిందని, యాభై లక్షల మందికి కంటి అద్దాలు అందించడం జరిగిందని వివరించారు. పేద ప్రజల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని, తెలంగాణలో అరోగ్య నగరాలు రూపాంతరం చెంది ప్రజలు అరోగ్యంగా ఉండాలనే దిశగా భారత దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమమును ప్రవేశపెట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రెండవ విడతలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు పంపిణీ చేసేలా విస్తృత చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రెండవ విడత కంటి వెలుగు 100 పనిదినాల కార్యక్రమ నిర్వహాణకు ప్రణాళికను రూపొందించు కోవడం జరిగిందన్నారు.  రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా చూపు మందగించిన వారికి పైసా ఖర్చు లేకుండా కంటివెలుగు శిభిరాల రూపంలో మీ వద్దకె వచ్చి కంటి పరీక్షలను నిర్వహించడంతో పాటు చూపు మందగించిన వారికి వెంటనే రీడింగ్ కళ్లాద్దాలను పరీక్షలు పూర్తయిన 5 నిముషాల లోపే అందించడం జరుగుతుందని, ఆపరేషన్  అవసరం ఉన్నవారికి మెరుగైన వైద్యం కొరకు ఆసుపత్రులకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరాలు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో కొనసాగుతాయని, అన్ని వర్గాల వారు భాగస్వాములై కంటి వెలుగును విజయవంతం చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 80 బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ శిబిరాలు సోమవారం నుండి శుక్రవారం వరకు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి రోజు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో  చివరగా శిభిరంలో కంటిపరీక్షలు చేయించుకున్న వారికి రీడింగ్ అద్దాలను మంత్రి అందజేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రులకు వెళ్లి కంటి పరీక్ష చేయించుకునే వెసులుబాటు లేనివారికి కంటి వెలుగు శిబిరాలు ఎంతో గొప్ప అవకాశంగా నిలుస్తాయని, వీటిని పూర్తి స్థాయిలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి వెలుగు శిబిరాల్లో నేత్ర పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు, దూర దృష్టికి కంటి అద్దాలు వెంటనే అందించడం జరుగుతుందని, ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమైన వారికి కూడా 15 నుండి 20 రోజుల్లోపు వారి ఇళ్లకు వెళ్లి అందజేసేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని అన్నారు. కాగా, ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై విజయవంతం చేసేందుకు కృషి చేయాలని, రెండవ విడత కంటివెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాకు ఇప్పటికే 1,04,409 కళ్లద్దాలను తెప్పించడం జరిగిందని, అవసరం మేర ప్రిస్కైబ్డ్ కళ్లాద్దాలను కూడా ఆర్డర్ చేసి ఆశా, ఎఎన్ఎంల ద్వారా అందించడం జరుగుతుందని పేర్కోన్నారు.  18 సంవత్సరాలు పైబడిన వారందరు రెండవ విడత కంటివెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, మేయర్ దుర్గా దీప్లా చౌహాన్, డిప్యూటి మేయర్ విక్రమ్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్ రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ గీత, మున్సిపల్ కమిషనర్, ఆర్డిఓ, కార్పోరేటర్ గౌరి శంకర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.