కాపాడాలని పోయి.. ప్రాణాలను కోల్పోయారు. ..గల్లంతైన ఇద్దరు రెస్క్యూ టిం సభ్యుల మృతదేహాలు లబ్యం.

Published: Friday July 15, 2022

మంచిర్యాల బ్యూరో, జూలై14, ప్రజాపాలన:

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతుండ‌డంతో పురిటినొప్పులు పడుతున్న ఓ గర్భిణిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు వెళ్లిన ఇద్ద‌రు రెస్క్యూ సిబ్బంది గ‌ల్లంతు అయ్యారు. ఈ ఘ‌ట‌న అసిఫాబాద్  జిల్లా పెసరకుంట పెద్ద‌వాగు వ‌ద్ద చోటు చేసుకుంది. బుధ‌వారం వీరు గ‌ల్లంతు కాగా వీరి కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేప‌ట్టారు గురువారం  ఉద‌యం వీరి మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి.  వివరాల్లోకి వెళ్తే...వట్టివాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పెద్దవాగు ఉప్పొంగి దహెగాం మండలంలో పలుచోట్ల ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరింది. మండలంలోని బీబ్రా గ్రామానికి చెందిన నేర్పల్లి సరస్వతికి బుధవారం పురిటి నొప్పులు రావడంతో దహెగాం పీహెచ్‌సీకి తరలించేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. దహెగాం, ఐనం, పెసరికుంట వద్ద పెద్దవాగు వరద కారణంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి నెల‌కొంది. దీంతో మధ్యాహ్నం కాగజ్‌నగర్‌ రూరల్‌ సీఐ నాగరాజు, స్థానికులు ట్రాక్టర్‌ సాయంతో దహెగాం సమీపంలో ప్రధాన రహదారిపై వరద దాటే ప్రయత్నం చేశారు. ట్రాక్టర్‌ మొరాయించడంలో వెనుదిరిగారు. విషయం తెలుసుకున్న సింగరేణి రెస్క్యూ టీంకు చెందిన ఆరుగురు తిరుపతి, మధుకర్, నర్సింగ్, చిలుక సతీష్, అంబాల రాము, గణేశ్‌ దహెగాంకు చేరుకున్నారు.  గణేశ్‌ బయట ఉండగా మిగిలిన ఐదుగురు, సీఐ నాగరాజు, మర్రిపల్లి గ్రామానికి చెందిన బాదవత్‌ తిరుపతి, జర్పుల శ్యాం, జర్పుల సతీశ్‌ మొత్తం తొమ్మిది మంది తాడు సాయంతో వరద నీటిలోకి దిగారు. ఒకరికొకరు రెండు మీటర్ల దూరంలో ఉంటూ దాటుతుండగా రెస్క్యూటీం సభ్యులు సీహెచ్‌ సతీశ్, రాము నీటిలో గల్లంతయ్యారు. వెంట‌నే మిగిలిన వారు ఉన్న‌తాధికారుల‌కు ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. అదనపు కలెక్టర్‌ రాజేశం ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలియగానే శ్రీరాంపూర్‌ జీఎం సంజీవరెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిపై సమిక్షించారు. శ్రీరాంపూర్‌ నుంచి మరో మూడు రెస్క్యూ బృందాలను ఘటన స్థలానికి పంపించారు. మందమర్రి, బెల్లంపల్లి నుంచి మరో రెండు బృందాలను పంపారు. పరిస్థితిని ఎప్పకటికప్పుడు అక్కడికి వెళ్లిన వారితో చర్చించారు. ఎట్ట‌కేల‌కు గురువారం ఉద‌యం వీరి మృత‌దేహాలు ల‌భ్యం అయ్యాయి. కాపాడాలని పోయి తమ ప్రాణాలను కోల్పోయిన రెస్క్యూ టిం సభ్యుల కు స్థానికులు కన్నీటి వీడ్కోలు పలికారు. .