ప్రభుత్వ బడులు కార్పోరేట్ స్థాయికి మించి వృద్ధి చెందాలి

Published: Wednesday February 23, 2022
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో 22 ఫిబ్రవరి ప్రజాపాలన : ప్రభుత్వ బడులను కార్పోరేట్ స్థాయికి మించి అభివృద్ధి చెందేలా కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. మంగళవారం డిపిఆర్సి భవనంలో ఏర్పాటు చేసిన మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి కార్యక్రమంపై వికారాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిని మించి అభివృద్ధి పర్చాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సబ్ కమిటీలో చర్చించి ఈ కార్యక్రమ కార్యాచరణ చేపట్టడటం జరుగుతుందని పేర్కొన్నారు. మూడు దశల్లో 7298.54 కోట్లతో 22 లక్షల మంది విద్యార్థులు చదివే 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమం జరుగుతుందని వివరించారు. మొదటి విడత లో 3500 కోట్ల వ్యయంతో 60 శాతం మంది విద్యార్థులు చదివే 35 శాతం ( 9123) పాఠశాలల ఎంపిక చేశారని స్పష్టం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. రెండు ప్రత్యేక అకౌంట్ లు తెరిచి, పారదర్శకంగా నిధులు ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. అన్ని పనులకు సామాజిక తనిఖీ నిర్వహించటం జరుగుతుందని అన్నారు. ప్రతి పనికి ప్రత్యేక సాఫ్ట్ వెర్ ద్వారా ఆన్లైన్ లో పొందుపరచటం జరుగుతుందని ఉద్ఘాటించారు. ఎంపిక చేసిన పాఠశాలలో అన్ని ప్రక్రియలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. విద్యా కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. వివిధ పనుల కోసం తీర్మానాలు చేయాలని హితవు పలికారు. ప్రభుత్వ బడి మనది అన్న భావన ప్రతి ఒక్కరిలో రావాలని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమం కింద 371 పాఠశాలలు ఎంపిక చేసి అభివృద్ధి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. 12 అంశాలలో పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. స్కూల్ కాంపౌండ్ వాల్ లో జూనియర్ కళాశాలలు ఉంటే వాటిని కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కోటి రూపాయలు విరాళంగా ఇస్తే ఆ పాఠశాలకు వారి పేరు పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థి ప్రపంచంలో  ఎక్కడికి వెళ్లిన రాణించేలా వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం జరుగుతుందని అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలకు నూతన శోభ చేకూరిందన్నారు. ప్రస్తుతం పాఠశాలల అభివృద్ధి మరో కలికితురాయిగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తున్నారని వివరించారు. ఈ సమావేశానికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, పట్నం నరేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, రాష్ట్ర విద్యా మౌళిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళికృష్ణ, అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, జిల్లా విద్యాధికారి రేణుకలు హాజరయ్యారు.