విద్యా పరిరక్షణ ఉద్యమానికి సిద్ధం కావాలి.

Published: Friday January 14, 2022
మంచిర్యాల బ్యూరో‌, జనవరి 13, ప్రజాపాలన : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను నిర్లక్ష్యం చేస్తున్నాయని విద్యావంతులు, మేధావులు విద్యా పరిరక్షణ ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రైవేట్ పాఠశాలల సంఘం ట్రస్మా జిల్లా అధ్యక్షులు రాపోలు విష్ణు వర్ధన్ రావు కోరారు. ఈ మేరకు గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ముందుకు జరిపి పాఠశాలలు మూసివేయడం జరుగుతుందని, గత వారం రోజులగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలలో వస్తున్న వార్తలు ఇటు తల్లితండ్రులని అటు విద్యార్థులను, ఉపాధ్యాయులని సైతం భయాందోళనలకు గురించేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే గనుక అలాంటి నిర్ణయమే తీసుకుంటే విద్యార్థులకు తీవ్రంగా విద్యా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలలో రోజుకు లక్షల కేసులు నమోదవుతున్న ఇంతవరకూ పాఠశాలలు మూసివేయలేదని గుర్తు చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో మనకంటే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నా ఇంతవరకు పాఠశాలలు మూసివేయ లేదని, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎలాంటి విపత్తు ఎదురైనా ముందుగా పాఠశాలలు మూసివేస్తారని విమర్శించారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే మానవ వనరులను పెంచాలని, మానవ వనరులు పెరగాలంటే విద్యాభివృద్ధి జరగాలని, విద్య అనేది నిరంతర ప్రక్రియలా కొనసాగాలని ఆయన అన్నారు.