సుప్రీం తీర్పు సరైనది కాదు, ఎస్సీ ల రిజర్వేషన్ 30 శాతానికి పెంచాలి దళిత నాయకుల డిమాండ్
Published: Wednesday November 09, 2022
బెల్లంపల్లి నవంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి: ఈ డబ్ల్యూ ఎస్, రిజర్వేషన్లను సమర్థిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాధాకరమైందని, సరైంది కాదని, ఎస్సీలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
మంగళవారం వారు మాట్లాడుతూ, ఈ దేశంలో కుల వివక్ష, అంటరానితనంతో, అణచివేతకు గురై, విద్య, ఉద్యోగ, అవకాశాలకు నోచుకోని వర్గాలకు, కుల ప్రాతిపదికన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తే, ఇప్పుడున్న అగ్రవర్ణ పార్టీలు, పాలకులు, సరికొత్త నాటకానికి తెరలేపి ఆర్థికపరమైన రిజర్వేషన్లను తీసుకొచ్చారని, వారికి రిజర్వేషన్లు లేకపోయినా 20 శాతం ఉన్నవారు 40 శాతం రిజర్వేషన్లు అనుభవిస్తూ, క్రొత్త ఎత్తుగడలతో ఎస్సీ ,ఎస్టీ, బీసీలకు అన్యాయం చేయడానికి రానున్న రోజుల్లో కులపరమైన రిజర్వేషన్లను ఎత్తివేయడానికి ,కుట్రగా భావించక తప్పదని వారన్నారు.
ఇలాంటి చర్యలను సుప్రీంకోర్టు సమర్ధించడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు.
దళిత, గిరిజన, బహుజనుల హక్కులను హరించడమే అని, దళిత గిరిజన బహుజనులు ఈ సంఘటనను ఎదిరించక తప్పదని, దేశంలో, రాష్ట్రంలో, ఉద్యమాలు చేయడానికి వెనకాడే ప్రసక్తి లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కాసర్ల యాదగిరి, ఉపాధ్యక్షులు సబ్బని రాజనర్సు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: