ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని వెంటనే పూర్తి చేయాలి

Published: Wednesday September 29, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 28, ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని వినోబా నగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2008లో ప్రారంభించిన డిగ్రీ కళాశాల ఇప్పటికి ఇంటర్ కళాశాలలోనే షిప్టింగ్ పద్దతిలో కొనసాగుతోందని, దీంతో అటు ఇంటర్ విద్యార్థులకు ఇటు డిగ్రీ విద్యార్థులకు న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. 2016లో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, పనులు మాత్రం నత్తనడకన కొనసాగుతున్నాయని అన్నారు. వెంటనే నిర్మాణాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పౌరస్పందన జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు అజ్మత్ ఖాన్, జిల్లా నాయకులు పి.కోట, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.శంకర్, డివిజన్ కార్యదర్శి పి.జగన్, మండల కార్యదర్శి మస్కు చరణ్, నాయకులు రాఘవేందర్, ఉదయ్, వినోద్, తరంగ్, చిరు, తరుణ్, మనీష్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.