ఈనెల 29న టిడిపి ఆవిర్భావ సభ విజయవంతం చేయాలి ** టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు సాయిరాం **

Published: Wednesday March 29, 2023

ఆసిఫాబాద్ జిల్లా మార్చి 28 (ప్రజాపాలన,ప్రతినిధి) : ఈనెల 29న హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో టిడిపి 41 వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని మంగళవారం విలేకరుల సమావేశంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పోల్కర్ సాయిరాం కోరారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారన్నారు.ఈ సందర్భంగా సాయిరాం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 41 వ ఆవిర్భావ సభను హైదరాబాదులో నిర్వహించడం జరుగుతుందని, ఈ సభలో తెలుగుదేశం పార్టీ  నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి పార్టీ ఆవిర్భావం తర్వాతనే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయని, ప్రతి సామాన్యుడికి కావలసిన సంక్షేమ పథకాలను రూపొందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వర్గాలకు విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లతో పాటు వారి అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. అవినీతిలో కూరుకుపోయిన ఈ ప్రభుత్వాలు వెళ్లిపోయి, తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.