రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి - శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి

Published: Monday May 16, 2022
నస్పూర్, మే 15, ప్రజాపాలన ప్రతినిధి : గనిలో  రక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి  సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించి, ఓబీ వెలికితీత, బొగ్గు ఉత్పత్తి, రవాణాకు సంబంధించి ప్రాజెక్ట్ ఆఫీసర్ పురుషోత్తమ రెడ్డి, మేనేజర్ జనార్ధన్ లతో రివ్యూ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ గనిలో రవాణా వ్యవస్థకు సంబంధించిన, రక్షణ కోసం తీసుకుంటున్న రక్షణ చర్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. వీలైనంత ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేస్తూ, ఉత్పత్తి చేసిన బొగ్గును వినియోగదారులకు వీలైనంత తొందరగా రవాణా చేయాలని, నాణ్యమైన బొగ్గు రవాణా చేయడం వల్ల సంస్థ అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
 ఓపెన్ కాస్ట్  గనుల్లో భారీ యంత్రాల వినియోగము చేస్తూ వాటి నుండి ఎక్కువ బొగ్గును తీయడానికి ప్రతి ఒక్క ఉద్యోగి ప్రయత్నించాలని సూచించారు. భారీ యంత్రాల మరమ్మతులకు సంబంధించిన అంశాలపైన కూడా దృష్టి సారించి వాటి వినియోగం సరైన మార్గంలో చేసుకోవాలని సూచించారు.