మంచినీటి పైప్ లైన్ పనులు త్వరలో ప్రారంభం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Published: Friday June 11, 2021

పటాన్చెరు, జూన్ 10, ప్రజాపాలన ప్రతినిధి : నాలుగున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పటాన్చెరు పట్టణంలో చేపట్టనున్న నూతన మంచి నీటి పైపులైన్ నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, హెచ్ ఎం డబ్ల్యు ఎస్ సి జి ఎం దశరథ రెడ్డి, జనరల్ మేనేజర్ బలరాం రాజులతో కలిసి పట్టణంలో పర్యటించారు. పైప్ లైన్ నిర్మాణ సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పట్టణంలో 40 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన పైప్ లైన్కి తరచు లీకేజీలు ఏర్పడటం మూలంగా సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఈ అంశంపై జలమండలి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, నాలుగున్నర కోట్ల రూపాయలు మంజూరు చేశారని. ప్రస్తుతం పటాన్చెరు పట్టణ పోలీస్ స్టేషన్ నుండి టోల్ గేట్ వద్ద గల జలమండలి కార్యాలయం వరకు నూతన పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రెండో దశలో నక్క వాగు నుండి పోలీస్ స్టేషన్ వరకు పైపులైన్ ఏర్పాటు చేయనున్నట్టు అన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు