ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిల్లో అందుబాటులోకి కోవిడ్ వైద్యసేవలు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డ

Published: Tuesday May 04, 2021
పటాన్ చేరు, మే 3, ప్రజాపాలన ప్రతినిధి : పటాన్ చేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు ప్రారంభమైనట్లు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇందుకు అనుగుణంగా సుమారు 70 ఆక్సిజన్ పడకలకు  సదుపాయం గల కోవిడ్ వార్డులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయాన పేర్కొన్నారు. సోమవారం ఉదయం వైద్యులు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని కోవిడ్ వార్డు ని పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తున్న తరుణంలో నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ రోగుల చికిత్స కోసం ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేశామని, ప్రజలు ఎమర్జెన్సీ సమయంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయడంతోపాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. రోగులకు నాణ్యమైన వైద్యంతో పాటు ఉచిత భోజన వసతి, సహాయకులకు వసతి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తారని ఆయన పేర్కొన్నారు. నూతనంగా కోవిడ్ వార్డు ఏర్పాటు చేస్తున్నందున ప్రజలు అందరూ సహకరించాలని, ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని, ప్రజలు సైతం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వసుంధర, వైద్యులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.