పలు రైళ్లకు మధిరలో హాల్టింగ్ ఇవ్వని అధికారులుఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

Published: Saturday September 24, 2022
మధిర సెప్టెంబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి ఖమ్మం జిల్లాలోని రెండవ అతిపెద్దదైన, నియోజకవర్గ కేంద్రమైన మధిర రైల్వే స్టేషన్లో పలు రైళ్లకు హాల్టింగ్ ఇవ్వకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధిర రైల్వే స్టేషన్ నుండి సుమారు 100 గ్రామాలకు చెందిన ప్రజలు ప్రతిరోజు మధిర రైల్వే స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు కొనసాగిస్తున్నారు. గతంలో మధిర రైల్వే స్టేషన్ లో నిలిచిన రైళ్ళను సైతం కోవిడ్ తర్వాత పునరుద్దించిన రైళ్లను రైల్వే శాఖ అధికారులు మధిరలో మాత్రం హాల్టింగ్ ఇవ్వటం లేదు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలు కోవిడ్ కంటే ముందు  మధిరలో హాల్టింగ్ ఉండేది. కోవిడ్ తర్వాత పునరుద్దించిన రైళ్లలో  ఈ రైలును  మధిరలో ఆపడం లేదు. అదే విధంగా గతంలో మధిరలో ఉదయం 7-39 గంటలకు విజయవాడ వెళ్లేందుకు ప్యాసింజర్ రైలు నెంబర్ 67211 ఉండేది. ప్రస్తుతం ఈరైలు కూడా నడవక పోవడంతో మధిర పరిసర ప్రాంత ప్రజలు ఉదయం విజయవాడ వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గతంలో మధిర రైల్వే స్టేషన్ లో హల్టింగ్ ఉన్న గౌతమి ఎక్స్ ప్రెస్ రైలు (ట్రైన్ నెంబర్ 12738, 12737) సింహపురి ఎక్స్ ప్రెస్ రైలు (ట్రైన్ నెంబర్ 12719, 12709) లను కూడా మధిరలో ప్రస్తుతం హల్టింగ్ ఇవ్వడం లేదు.గతంలో మధిరలో ఆగిన లక్నో ఎక్స్ ప్రెస్ రైలు కూడా ప్రస్తుతం మధిర స్టేషన్లో అగటం లేదు.ఈ ట్రైన్ మధిర కంటే చిన్నదైనా ఎరుపాలెం రైల్వే స్టేషన్లో ఆగటం విచిత్రం. ఇటీవల కాజీపేట నుంచి తిరుపతికి నూతనంగా వేసిన ట్రైన్ నెంబర్ 07091, 07092 కూడా మధిరలో హల్టింగ్ లేదు. ఈ రైలు కూడా మధిర కంటే తక్కువ ఆదాయం వస్తున్న కేసముద్రంలో కూడా ఆగుతుంది. కానీ మధిరలో మాత్రం ఈ ట్రైన్ కి హాల్టింగ్ లేదు. మధిరలో ఎప్పటినుంచో నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలును (నెంబర్ 12655,  12656) ఆపాలను ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నా ఇంతవరకు అతి గతి లేదు. గతంలో పెద్దపల్లి నుంచి విజయవాడ వరకు   (రైలు నెం 77251) ఉన్న డెమో ప్యాసింజర్ రైలు కూడా రద్దు చేశారు. దీన్ని ఇంతవరకు కూడా పునరుద్ధరించలేదు.దసరా సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఎన్నో ప్రత్యేక రైళ్లను  ఏర్పాటు చేసింది. ఇందులో చాలా రైళ్లు మధిర నుండే వెళుతుంటాయి. కానీ ఒక్క రైలు కు కూడా మధిరలో హల్టింగ్ ఇవ్వలేదు. ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాల నుండే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి ప్రయాణికులు మధిర రైల్వే స్టేషన్ నుండి వివిధ ప్రాంతాలకు రైళ్ల  ద్వారా ప్రతిరోజు ప్రయాణిస్తుంటారు.  సుమారు ప్రతిరోజు లక్షన్నరకు పైగా ఆదాయం వస్తుంది. మధిర రైల్వే స్టేషన్లో ఎక్కువ రైళ్లను ఆపితే ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉండటమే కాకుండా ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మధిర రైల్వేస్టేషన్లో రైళ్లను ఆపాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులకు, స్థానిక నేతలకు ఈ ప్రాంత ప్రజలు విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి మధిర రైల్వే స్టేషన్లో పలు రైళ్లును ఆపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు.