కరోనాను జయించిన మంత్రి కొప్పుల దంపతులు

Published: Saturday May 15, 2021
జగిత్యాల, మే 14 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా బారిన పడిన సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు వారి సతీమణి స్నేహాలత కరోనాను జయించారు. ఈ నెల 6వ తేదీ మంత్రి సతీమణి స్నేహలతకు పాజిటివ్ నిర్దారణ కాగా 9వ తేదీన జరిపిన కొవిడ్​ పరిక్షలో నెగిటివ్ వచ్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ సోషల్​ మీడియా, ట్విట్టర్​ ద్వారా తెలిపారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. 6 రోజుల చికిత్స పొందిన అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు శుక్రవారం రోజున డిశ్చార్జ్ కావడం జరిగింది. వైద్యుల సలహా మేరకు మినిస్టర్స్ క్వార్టర్స్ లో తన నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రికి కరోనా నెగెటివ్​ అనే విషయం తెలియగానే ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారిని జయించడానికి  పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతోనే నాకు ధైర్యం వచ్చిందని మంత్రి అన్నారు.