ఆక్సిజన్ తో ఆయువు నిలుపుతాము

Published: Monday May 10, 2021
జెకెఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆక్సీజన్ కాన్ స్టంట్రేటర్స్ పంపిణీ
మాజీ చేవెళ్ళ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
వికారాబాద్, మే 09, ప్రజాపాలన బ్యూరో : కరోనా మహమ్మారి ఆయువు తీయాలని చూస్తే ఆక్సిజన్ సరఫరా చేసి తాము ఆయువు నిలుపుతామని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోవిడ్ బాధితలకు భరోసా కల్పించారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రం పరిధిలోని శ్రీ సాయి డెంటల్ కళాశాల ఆవరణలో జస్టిస్ కొండ మాధవ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆక్సీజన్ కాన్ స్టంట్రేషన్ యంత్రాలను పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి సోకితే ఆక్సిజన్ అందకుండా వ్యక్తిపై దాడి చేసి ప్రాణాలను హరిస్తుందని అన్నారు. కరోనా బాధితులకు ఆక్సిజన్ అందాలి అంటేనే ఆకాశం అంత ఎత్తులో ఆక్సిజన్ ధరలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కరోనా బాధితులకు ఆక్సిజన్ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుపేద కోవిడ్ బాధితుల కోసమే ఉచితంగా ఆక్సిజన్ అందించి ప్రాణాలను నిలపాలనే లక్ష్యంతో జస్టిస్ కొండ మాధవరెడ్డి ఫౌండేషన్ కృషి చేస్తుందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరం కంటే కోవిడ్ బాధితులు పది రెట్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. జేకేఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ నిరుద్యోగ యువతకు ఎన్ 95 కంటే సురక్షితమైన  ప్రత్యేమైన మాస్కుల తయారీలో శిక్షణ ఇచ్చామని వివరించారు. మా శారదా ఆసుపత్రిలో తర్ఫీదు పొందిన వైద్య సిబ్బందిచే ఆక్సీజన్ అందిస్తామని అన్నారు. ఇందులో భాగంగా జెకెఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్మనీ దేశం నుండి 25 ఆక్సిజన్ కాన్సన్ట్రేటేషన్ యంత్రాలను తెప్పించామని పేర్కొన్నారు. ఇందులో 13 ఆక్సీజన్ కాన్ స్టంట్రేషన్ యంత్రాలను మా శారదా ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. చైనా సరఫరా చేసే ఆక్సీజన్ కాన్ స్టంట్రేషన్ కంటే 99.99 శాతం ఉత్తమమైనవని అన్నారు. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని సూచించారు. కరోన సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు అందరు తగు జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ అంబదాస్, మేనేజర్ రహీమున్నీసా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షుడు అనంత్ రెడ్డి, రెడ్యా నాయక్, చాపల శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.