కొండాపూర్ జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Published: Wednesday May 19, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : ప్రయివేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చి దిద్దుతున్నామని, జిల్లా ఆస్పత్రితో పాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సమన్వయంతో రోగులకు సేవ చేయాలని కొండాపూర్ జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, కలెక్టర్ అమోయ్ కుమార్, వైద్యాధికారులు, ఇతర అధికారుల తో కలిసి కొండాపూర్ జిల్లా ఆస్పత్రిని మంగళవారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనిఖీ చేసారు. ఆస్పత్రిలో అన్ని వార్డులను సందర్శించిన విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి కోవిడ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణతో కోవిడ్ పై ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూన్నారన్నారు. కొండాపూర్ ఆస్పత్రిలో అదనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో 100 ఆక్సిజన్  బెడ్లు ఏర్పాటు చేయటం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా వనస్థలిపురంలో 50 బెడ్లు, షాద్ నగర్ లో 50 బెడ్లు, జల్ పల్లి లో 40 బెడ్ల తో కోవిడ్ కేర్ సెంటర్ ల ఏర్పాటు చేసారన్నారు. ఆస్పత్రుల్లో కోవిడ్ పేషంట్లకు అందుతున్న వైద్యం, ఇతర సదుపాయాలపై అరా తీసారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన ఫీవర్ సర్వే నేడు దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక సారి పూర్తి అయిన జ్వర సర్వే, కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి అవసరమైన మందులు, కిట్ లు అందించటం జరిగిందన్నారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించి, కనీస జాగ్రత్తలతో కరోనా రహిత సమాజం కోసం కృషి చేయాలని సూచించారు. వాక్సినేషన్ ఇబ్బందులు దూరం చేయటానికి, అందరికి వాక్సిన్ వేయటానికి గ్లోబల్ టెండర్లు పిలవడం జరుగుతుందని, ప్రజలందరికీ వాక్సిన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన వాక్సిన్ లు కేంద్రం పరిధిలో ఉండటం, సరిపడా కేటాయింపులు లేక పోవడంతో గ్లోబల్ టెండర్లకు వెళ్ళటం జరుగుతుంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, విప్ గాంధీ, ఎప్పటికప్పుడు జిల్లా ఆస్పత్రిపై ప్రత్యేక నిఘా పెట్టి బాగా పనిచేస్తున్నారని మంత్రి ప్రశంసించారన్నారు. కొండాపూర్ ఆస్పత్రి ప్రత్యేక అధికారిగా శేరిలింగంపల్లి తహశీల్దార్ వంశీ మోహన్ నియమించారన్నారు. స్థానిక ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ మాట్లాడుతూ కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలో అన్ని రకాల మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో, జిల్లా మంత్రి సబితా రెడ్డి సహకారంతో కోవిడ్ పై పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆస్పత్రిలో మెరుగైన వసతుల కోసం సమీక్షించటం జరిగిందని, రోగులతో కూడ మాట్లాడి ఏ మేరకు వైద్యం అందుతుందో తెలుసుకున్నామన్నారు. కల్వరి టెంపుల్ లో 300 బెడ్ లు, న్యాక్ లో 200 బెడ్లతో కోవిడ్ కేర్ సెంటర్ ల ఏర్పాటు. చేసామని, నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున వస్తునందున అదనపు సిబ్బంది కోసం కేంద్రం వాక్సిన్ కొనుక్కో మని చెప్తుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచితంగా ఇస్తామని ప్రకటించటం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ ప్రతిక్, డీసీపీ వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు స్వరాజ్యాలక్ష్మి, ఝాన్సీ, జోనల్ కమిషనర్ రవి కిరణ్, ఆర్ ఎం ఓ రామకృష్ణ, ఆస్పత్రి సుపేరిడెంట్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు.