నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Wednesday November 23, 2022
మంచిర్యాల బ్యూరో, నవంబర్ 22, ప్రజాపాలన :
 
ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట లభించే విధంగా ప్రభుత్వం చేపట్టిన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణంలో భాగంగా జిల్లాలోని నస్పూర్లో చేపట్టిన నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ బి. రాహుల్తో కలిసి నస్పూర్లో నిర్మాణంలో ఉన్న నూతన కలెక్టరేట్ భవనంలో నిర్మితమవుతున్న సమావేశ మందిరం, కలెక్టర్ చాంబర్, క్యాంపు కార్యాలయం, వివిధ శాఖలకు కేటాయించబోవు కార్యాలయ గదులను పరిశీలించి గుత్తేదారుకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా కార్యాలయ పనులను పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని రోడ్డు-భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం భవన నిర్మాణంలో కొనసాగుతున్న విద్యుత్, పైప్ లైన్, నీటి సరఫరా, ఆవరణ ఇతరత్రా పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.