సమస్యల వలయంలో మధుకాలని
Published: Friday July 02, 2021
మౌలిక వసతుల లేమి
దొంగలతో వణుకుతున్న కాలనీ వాసులు
విష పురుగులతో సహవాసం
వికారాబాద్ జూలై 01 ప్రజాపాలన బ్యూరో : సమస్యల వలయంలో చిక్కుకున్న వార్డు. కనీస మౌలిక వసతుల లేమితో కొట్టు మిట్టాడుతున్న కాలని. అంధకార బంధురంలో విషపురుగులతో సహవాసం. దీనికి తోడు దొంగల స్వైర విహారం. అండర్ డ్రైనేజీ లేక ఇళ్ళ నుండి వచ్చే మురికి నీరు రోడ్లపై తటాకాలను తలపిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే నీటి కుంటలను తలపించే దృశ్యం. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డుకు చెందిన మధుకాలనీ కౌన్సిలర్ ఫైమీదా బేగమ్. కౌన్సిలర్ తో పాటు కాలనీ ప్రజలు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా పరిష్కార మార్గం శూన్యం. గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్, మున్సిపల్ కమిషనర్ బుచ్చయ్యలతో కలిసి మధుకాలనీని సందర్శించి పరిశీలించారు. కాలనీ ప్రజలు మూకుమ్మడిగా సమస్యల చిట్టాను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. కుక్కల వీర విహారంతో చిన్నారుల పాలిట మృత్యు శాపాలుగా పరిణమిస్తున్నాయి. గాలిదుమారంతో లూజ్ విద్యుత్ వైర్లు ఎప్పుడు తెగిపడుతాయో భయం గుప్పిట్లో కాలనీ ప్రజలు.
Share this on your social network: