జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Published: Thursday March 30, 2023
* రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో 29 మార్చి ప్రజాపాలన :  జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి  పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం  పదవ తరగతి పరీక్షల నిర్వహణపై  విద్యాశాఖ సెక్రెటరీ  వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన, ఉన్నతాధికారులతో కలిసి  రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఇంటర్మీడియట్ పరీక్షలను అధికారులు  విజయవంతంగా నిర్వహించి నందుకు అభినందనలు తెలిపారు.  ఏప్రిల్  3 నుంచి ఏప్రిల్ 13 వరకు జరుగు పదవ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. 10వ తరగతి పరీక్షలో గతంలో ఉన్న 11 పేపర్లను ప్రస్తుతం 6 పేపర్లుగా కుదించామని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు.  ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తప్పనిసరిగా ఏఎన్ఎం అందుబాటులో ఉండాలని మంత్రి పేర్కొన్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు రవాణా కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఉదయం, మధ్యాహ్నం నడపాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు.  వేసవి కాలంలో పరీక్షలు నిర్వహిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. విద్యార్థులకు హాల్ టికెట్ లను వెబ్ సైట్ bse.telangana.gov.in లో ఉంచామని, విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవాలని అన్నారు.  పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష హాల్ లో త్రాగునీరు అందించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి అన్నారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలకు ఎవరు సెల్ ఫోన్ తీసుకుని వెళ్లడానికి వీలు లేదని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు అధికంగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని,  విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహకం, మోటివేషన్ అందించాలని తెలిపారు.
 సమావేశంలో పాల్గొన్న విద్యా శాఖ  కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ... పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.30 జరుగుతాయని,  ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ పరీక్షలు 9.30 నుంచి 12.50 వరకు జరుగుతుందని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ... పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు.  జిల్లాలో పదవ తరగతి పరీక్షలు 74 కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందని, ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్తు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ కై చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు ఆదేశించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ , విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు హాజరయ్యే విధంగా  ఆర్టిసి బస్సులను నడిపించాలని  కలెక్టర్ తెలిపారు. బస్ స్టాండ్ లలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం అదేవిధంగా ఏఎన్ఎం, ఆశా వర్కర్ తో పాటు మందులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రాల్లోకి  మొబైల్ ఫోన్ అనుమతించకూడదని కలెక్టర్ తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,  డిఇఓ రేణుకా దేవి,  డిఎంహెచ్ఓ పాల్వన్ కుమార్,  అడిషనల్ ఎస్పీ మురళీధర్, విద్యుత్ శాఖ ఎస్.ఇ. దేవరాజు తో పాటు ఆర్టీసీ,  పోస్టల్ , మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.