డిసెంబర్ 3 నుండి ప్రథమ సంవత్సరం ఒకేషనల్ ప్రాక్టికల్స్ : డీఐఈఓ

Published: Thursday December 02, 2021
కాగజనగర్, డిసెంబర్ 1, ప్రజాపాలన, ప్రతినిధి : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 3వ తేదీ నుండి ఒకేషనల్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించబడతాయని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియేట్ బోర్డ్ ఆదేశానుసారం జిల్లాలో గత విద్యాసం అడ్మీషన్ పొంది ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ రికార్డులను కళాశాలల్లో సమర్పించాలని అన్నారు. పరీక్ష సిలబస్, ప్రశ్నాపత్ర నమూనాలను బోర్డు వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని తెలిపారు. మొత్తం సిలబస్ లో 70% నుండి మాత్రమే ప్రశ్నలుంటాయని, 50% ప్రశ్నలు ఛాయిస్ ల రూపంలో అదనంగా ఇవ్వనున్నారని తెలిపారు. కళాశాల అధ్యాపకులే ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తారని అన్నారు. ఆన్ జాబ్ ట్రైనింగ్ సంబంధిత రికార్డులను పరిశీలించి మార్కులు నమోదు చేస్తారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 8 కళాశాలల్లో 887 మంది విద్యార్థులకు ఈ పరీక్షలుంటాయని ఆయా విద్యార్థులు వెంటనే సంబంధిత ప్రిన్సిపాళ్లను, అధ్యాపకులను సంప్రదించాలని తెలిపారు.