వెజ్, నాన్ వెజ్ మార్కెట్ యార్డు నిర్మాణ పనులు పరిశీలన

Published: Wednesday March 01, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 28 ఫిబ్రవరి ప్రజాపాలన : కొడంగల్ పట్టణంలోని పట్టణ ప్రకృతి వనం, నర్సరీ, కంటి వెలుగు శిబిరం, డయాలసిస్ సెంటర్లను  జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తపరిచారు. మంగళవారం పట్టణంలో రెండు ఎకరాల స్థలంలో నిర్మించ తలపెట్టిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ యార్డ్ పనుల పురోగతిని పరిశీలించి అవసరమైన ఇసుక అందించడం జరుగుతుందని, పనులను నిరంతరంగా కొనసాగిస్తూ నాణ్యమైన పనులు చేపట్టి ఏప్రిల్ మాసాంతం వరకు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రకృతి వనం,నర్సరీలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తపరిచారు.  చెట్లకు సాసరింగ్  చేసి వేసవిలో ప్రతిరోజు నీరు పట్టాలన్నారు.  హరితహారంలో నాటే మొక్కలు కనీసం 8-10 సైజు ఉండాలని సూచించారు. వచ్చే హరితహారం లో నాటేందుకు నర్సరీకి అవసరమైన 41 వేల మొక్కలను అందుబాటులో ఉంచాలని అన్నారు.
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ ఈ సందర్భంగా సందర్శించారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలలో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా ఆశాలు, ఏఎన్ఎం లను ఇంటింటికి పంపి అవసరమైన ప్రజలను గుర్తించి క్యాంపులకు తీసుకురావాలన్నారు. శిబిరంలో ప్రజలకు అందుతున్న కంటి అద్దాలు, సేవల పట్ల ప్రజలను అడిగి తెలుసుకున్నారు.  కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించి వైద్య సేవలు పొందుతున్న రోగులను పలకరించారు. వారికి అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వివిధ విభాగాలను సందర్శించి పరిశీలించారు. పట్టణంలో లక్ష్యాలకు అనుగుణంగా వైద్యుల పని చేయాలని, ఇక్కడ ప్రజలు వైద్య చికిత్సలకు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మంచి వైద్య సేవలు అందించాలన్నారు. పట్టణంలో ఉన్న 22 మంది డయాలసిస్ పేషెంట్లకు సోమవారం నుండి నిరంతరంగా నాణ్యమైన డయాలసిస్ సేవలు అందించాలన్నారు. కొత్తగా నిర్మితమవుతున్న మున్సిపల్ కార్యాలయంలో నిర్మాణపు పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులను ఆపకుండా నిరంతరంగా నిర్వహించి మే మాసంతము వరకు పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించారు.  రికార్డు రూమ్ లో రికార్డులు సరిగా ఉన్నాయా అని సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకుకున్నారు.  రికార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.  అక్కడికి చేరుకున్న పలువురు ప్రజల నుండి వివిధ సమస్యలపై విజ్ఞప్తులను కలెక్టర్ స్వీకరించారు.  అయ్యే పనులు అవుతాయని కాని పనులు కావని స్పష్టంగా వారికి తెలియజేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో పాండు, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ లతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీలలో మొదటి ప్రాధాన్యంగా పారిశుద్ధ్యం పనులు చేపట్టాలన్నారు. గ్రామాలలోని రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.  ప్రతిరోజు మురికి కాలువలను పరిశుభ్రం చేసి నీరు నిలవకుండా ఉంచాలన్నారు. రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు.  వేసవిలో గ్రామ పంచాయతీలోని ప్రతి హ్యాబిటేషన్ కు మిషన్ భగీరథ సాగునీరు సమృద్ధిగా అందించాలన్నారు.  మిషన్ భగీరథ నీరు అందకుంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పటి నుండి చూసుకొని వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా పరిష్కరించుకోవాలని అన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రతి మూడు రోజులకు ఒకసారి క్లోరినేషన్ చేయాలని, నీరు సక్రమంగా అందుతున్నాయా లేదా పరిశీలించుకోవాలని అన్నారు. హరితహారంలో నాటిన మొక్కలు వేసవికాలంలో చనిపోకుండా చూడాలని, ప్రతిరోజు ట్యాంకర్ల ద్వారా నీరు పట్టాలని అన్నారు.  మొక్కలు ఉండిపోతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.  నర్సరీలలో లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలని, ఖాళీ బ్యాగులు కనిపించవద్దని అన్నారు. అన్ని వైకుంఠధామాలను వినియోగంలోకి తీసుకురావాలని, మరుగుదొడ్లు,  నీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. వైకుంఠధామాలలో ఖాళీగా ఉన్న స్థలంలో  మొక్కలు పెంచి అందంగా తీర్చిదిద్దాలన్నారు. గ్రామాలలో తడి పొడి చెత్తను 100 శాతం సేకరించాలని కంపోస్టు షెడ్ల ద్వారా ఎరువుల తయారీ చేపట్టాలని, సూచనలు అన్నింటిని తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు.  తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వినాలను అందంగా తీర్చిదిద్దాలని సూచించారు.  ఇందులో వచ్చే వారికి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడాలన్నారు.  ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతిరోజు అటెండర్లతో కార్యాలయాలలో పరిశుభ్రత పనులు చేయించాలని అన్నారు.  కార్యాలయ ఆవరణలో ఉన్న మొక్కలను ప్రతిరోజు నీరు పోసి సంరక్షించాలని, అవెన్యూ ప్లాంటేషన్ వద్ద పిచ్చి మొక్కలను తొలగించి మొక్కలకు సాసరింగ్  చేసి ప్రతిరోజు ట్యాంకర్ల ద్వారా నీరు పట్టాలని అన్నారు.  రోడ్డు ప్రక్కన గల మొక్కలు తగలబడకుండా చూసుకోవాలి అన్నారు.  గ్రామాలలో టాక్స్ కలెక్షన్ 100 శాతం పూర్తి చేయాలని సూచించారు.  రేషన్ షాపుల ద్వారా నిర్ణీత సమయంలో ప్రజలకు సరుకులు అందే విధంగా చూడాలని అన్నారు.  అంగన్వాడి కేంద్రాలలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని, పాఠశాలలో విద్యార్థులకు మంచి విద్యను అభ్యసించాలని ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని సూచించారు. మెనూ ప్రకారంగా మిడ్ డే మీల్స్  అందించాలని, పిల్లల పట్ల నిర్లక్ష్యం వాయించరాదని సూచించారు. గ్రామాలలో నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించి, ప్రమాదకర స్తంభాలు తీగలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో లేబర్ మొబిలైజేషన్ పక్కగా జరగాలన్నారు. ఎన్ ఆర్ ఇ జి ఎస్  క్రింద చేపట్టే పనులు గ్రామానికి ఉపయోగకరంగా ఉండాలని సూచించారు.  సులభంగా పనులు కావని, కష్టపడితేనే పనులు అవుతాయని ఎన్ఆర్ఇజిఎస్ ద్వారా మంచి పనులు చేపట్టాలని అన్నారు.  పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు అన్ని పనులు చేపట్టి పూర్తి చేయాలన్నారు. అవసరమైన ఇసుక అందించడం జరుగుతుందని తెలియజేశారు. పనులు అన్నిటిని వేగవంతం చేసి సీసీ రోడ్ల పనులు పూర్తి చేయాలన్నారు. అధికారులందరూ సమయానికి విధులకు హాజరుకావాలని, అటెండెన్స్ యాప్ ను తప్పకుండా వాడాలని అన్నారు.  తిరిగి కొడంగల్ కు మళ్లీ వచ్చినప్పుడు పైన తెలిపిన పనులను పరిశీలించడం జరుగుతుందని, బాగా చేసిన వారిని అభినందిస్తానని, పని చేయని వారిపై తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఉషారాణి, తాసిల్దార్ బుచ్చయ్య, మున్సిపల్ డి ఈ రంగనాథం, ఏ ఇ ఖాజా హుస్సేన్, డాక్టర్ కె వి ఎన్ మూర్తి, వేద శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.