అయ్యా మా గోడు వినండి అద్వానంగా ఆర్ అండ్ బి రహదారులు ప్రమాదాలకు గురి అవుతున్న వాహనదారులు

Published: Tuesday August 23, 2022

మధిర ఆగస్టు 22 ప్రజా పాలన ప్రతినిధి  మధిర డివిజన్లో రహదారులు భవనాల శాఖకు సంబంధించిన అనేక రహదారులు గుంతలమయంగా మారాయి. ప్రధాన రహదారులపై సైతం భారీ స్థాయిలో గుంతలు ఏర్పడటంతో అనేక సార్లు ప్రమాదాలు జరిగి కొందరు మృత్యువాత గురికాగా మరికొందరు తీవ్రగాయాలతో బయట పడ్డారు. మధిర వైరా ప్రధాన రహదారిపై ఆత్కూరు సిరిపురం సమీపంలో అడుగు లోతులో గుంతలు ఏర్పడి అనేక ప్రమాదాలు జరిగాయి. ఇదే రహదారిపై బోనకల్లు మండలం మండలం కలకోట బ్రాహ్మణపల్లి గ్రామాల వద్ద అనేక సంవత్సరాలుగా గుంతల ఏర్పడి ప్రమాదాలు జరిగాయి. అయినా కూడా ఆర్ అండ్ బీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కొద్దికాలం క్రితం రహదారిపై మట్టితో మరమ్మతులు చేపట్టగా ఇటీవల వచ్చిన అకాల వర్షాలకు మట్టి కొట్టుకొని కాకపోవడంతో మళ్ళీ కొత్తగా గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కాలంలో సిరిపురం పెట్రోల్ బంక్ వద్ద ఏర్పడిన గుంతలో పడి అనేకమంది గాయపడ్డారు. ఇది ఇలా ఉండగా గ్రామాలకు వెళ్ళే అనేక లింక్ రోడ్లు సైతం అధ్వానంగా ఉన్నాయి. మధిర నుండి బయ్యారం వెళ్లే రహదారి, అల్లినగరం వెళ్లే రహదారి ధ్వంసమైంది. అదేవిధంగా మల్లారం మీదగా నెమలి వెళ్లే రోడ్డు బోనకల్ మండలం రావినూతల మీదగా పొద్దుటూరు వెళ్లే రహదారి, తూటికుంట్ల నుండి గొల్లపూడి వెళ్లే రహదారి అనేక సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో ఆ రహదారిపై ప్రయాణం చేయాలంటే ప్రజలు నరకయాతన పడుతున్నారు. మధిర నుండి  విజయవాడ వైపు వెళ్లే రహదారిలో దెందుకూరు బ్రిడ్జి వద్ద భారీ స్థాయిలో గుంతలు పడి అక్కడ ప్రమాదాలు జరిగి అనేక మంది మృతి చెందారు. రోడ్డు ప్రమాదాలపై రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించి పోలీసులు శ్రమదానంతో కొన్ని చోట్ల గుంటలను పూడ్చి వేశారు. ఆర్ అండ్ బి మరియు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రహదారులకు మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.