ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు.

Published: Monday April 11, 2022
వెంటనే విద్యుత్ డెవలప్మెంట్ ఛార్జీలను విరమించుకోవాలి.
సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి. మధు .
మంచిర్యాల బ్యూరో, ఎప్రిల్ 10, ప్రజాపాలన : సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ మంచిర్యాల జిల్లా కమిటీ సమావేశం స్థానిక జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఏ.రమణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి.మధు హాజరై మాట్లాడుతూ... 2014లో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిత్యవసర వస్తువులు, ఇతర ధరలు మామూలుగా ఉండేవని, కానీ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ముడి చమురు పెట్రోల్, డీజిల్, గ్యాసు, నిత్యావసర సరుకుల ధరలు పెంచిందని విమర్శించారు. ప్రస్తుతం పేద ప్రజలు బతకడానికే ఇబ్బందిగా మారుతుంటే కేంద్ర ప్రభుత్వం అధిక ధరల పేరుతో సామాన్యుల నడ్డి విరుస్తుందని అన్నారు. మరోవైపు విద్యుత్ డెవలప్మెంట్ చార్జీల పేరుతో ఒక్కొక్క వినియోగదారుడి పైన మూడు నుంచి ఐదు వేలు రూపాయలను అధిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోపుతుందని విమర్శించారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం  ఇప్పటికే రెండు సార్లు వివిధ రూపాల్లో బస్సు చార్జీలు పెంచిందని అన్నారు. సామాన్య పేద ప్రజలను ఎదో ఒక రకంగా దోపిడి చేయాలనే ఆలోచనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, ఈ సందర్భంగా ప్రజలందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల పైన ఆందోళన కార్యక్రమాలు చేయాలని సిఐటియు మంచిర్యాల జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు సంకె రవి గోమాస ప్రకాష్, దాసరి రాజేశ్వరి, కోశాధికారి రామస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి బాలాజీ, దూలం శ్రీను, రాజలింగు, భాగ్యరాజు, అజిజ్, రాజేందర్, రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.