ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి

Published: Saturday December 24, 2022
 టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 23 డిసెంబర్ ప్రజా పాలన : ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేసి ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు కృషి చేస్తుందని టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టే పనుల పర్యవేక్షణకు వచ్చిన చైర్మన్ మోమిన్ పేట మండలం చంద్రాయన్ పల్లి, ఆమ్రాది కుర్దు గ్రామ  పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులతో మాట్లాడుతూ ..  మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని సూచించారు . ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మంచి విద్యను అందించేందుకు, అన్ని మౌలిక సౌకర్యాలతో కూడిన వసతులను కల్పిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు . పాఠశాలలో తక్కువ మంది విద్యను  అభ్యసిస్తున్నప్పటికి  లక్షల వ్యయంతో పాఠశాలల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ప్రహరీ గోడను నిర్మించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.  మోమిన్ పేట మండలంలోని చంద్రాయన్ పల్లి పాఠశాలకు 15 లక్షల వ్యయంతో అదే విధంగా ఆమ్రాదికుర్దు పాఠశాలకు 24 లక్షల వ్యయంతో పనులు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని
సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. చైర్మన్ పాఠశాలల గదులను సందర్శించి పనుల నాణ్యతను పరిశీలించారు. పాఠశాలల్లో జరుగుతున్న పనుల పురోగతిపై చైర్మన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ , జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి , పంచాయత్ రాజ్ ఇ.ఇ. శ్రీనివాస్ రెడ్డి , ఎంపీడీవో శైలజ రెడ్డి , మండల విద్యాశాఖ అధికారి గోపాల్, చంద్రాయన్ పల్లి సర్పంచ్ గొల్ల అంజయ్య,  అమ్రాది కుర్దు సర్పంచ్ సునీత మల్లేష్,  ఎస్ఎంసి చైర్మన్ లు లక్ష్మణ్,    సుమలత,  ప్రధానోపాధ్యాయులు రమేష్ , దేవ్ నాయక్ , గ్రామపంచాయతీ కార్యదర్శులు లావణ్య , మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.