మాతృభాష ద్వారానే సాంస్కృతిక మూలాల పరిరక్షణ సాధ్యం

Published: Tuesday February 23, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన : మాతృభాష ద్వారానే  మన సాంస్కృతిక మూలాలను కాపాడుకోవచ్చునని, దానికి ప్రభుత్వ విధాన నిర్ణయాలు కూడా కారణమవుతాయని హెచ్ సియు ప్రొఫెసర్  దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం మియాపూర్ లోని డా.పోతుకూచి సోమసుందరం ట్రస్టు లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మాతృభాషగా తెలుగు అభివృద్ధి సాధించినప్పుడే మాతృభాష పట్ల ప్రజలకు మరింత విశ్వాసం ఏర్పడుతుందని ఆయన అన్నారు. మన  పూర్వీకులు అందించిన జ్ఞాన పరంపర అందుకోవడానికి మాతృభాష ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. మన నిత్య మానవ సంబంధాలకు మాతృభాష మాత్రమే ఎంతో అనుకూలంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లో ఆంగ్ల భాషకు బదులుగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వారి మాతృభాషనే వినియోగించుకుంటున్నారనీ తెలిపారు. మన భావాలు ఎదుటి వ్యక్తులకు శక్తివంతంగా అర్ధం కావడానికి మాతృభాష ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పియస్ యస్ ట్రస్ట్ చైర్మన్ డా.పోతుకూచి శ్రీనివాస్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాకలపాటి శ్రీనివాస్, విష్ణుప్రసాద్, జనార్ధన్, పాలెం శ్రీను, భాస్కర్ రెడ్డి, తెలుగు భాషాభిమాని రామ్మోహన్, సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ రామ్ ప్రసాద్ నలసాని, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.