యథేచ్ఛగా ప్రభుత్వ భూమి కబ్జా - చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు

Published: Friday September 23, 2022
- అధికార పార్టీ నాయకుల హస్తం
శేరిలింగంపల్లి- ప్రజా పాలన/ సెప్టెంబర్ 22 న్యూస్ : పేదవాడు తలదాచుకోవడానికి చిన్న గుడిసె వేసుకున్నా చాలు ఆఘమేఘాల మీద తమ ప్రతాపాన్ని చూపే రెవెన్యూ అధికారులు అదే పెద్దవాళ్ళు, అధికారం ఉన్నవాళ్లు కోట్లాది రూపాయల విలువగల భూములు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నా పట్టించుకోరు కదా తమకేమీ తెలియనట్లు అటు వైపు కన్నెత్తి కూడా చూడరు. తాజాగా శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ మక్తా లోని కిందికుంట చెరువు కట్టకింద సర్వేనెంబర్ 77 లోని దాదాపు 12 గుంటల ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకులు కబ్జా చేశారు. నగరంలో భూముల ధరలు ఆకాశాన్నoటడంతో ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను పడడంతో వాటిని తమ కబంధ హస్తాల్లోకి తీసుకుంటున్నారు శేరిలింగంపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ భూములు ఇప్పటికే చాలా మట్టుకు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పుడు తాజా గా ఈ స్థలంపై గురిపెట్టిన కబ్జాదారుల కన్ను పడిందే తడవుగా ఆలస్యం చేయకుండా స్థలం చుట్టూ రేకులు పెట్టి కబ్జా చేశారు. ఇంత విలువైన స్థలం కబ్జాకు గురైతే అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
 
అధికార పార్టీ నాయకులే సూత్రధారులా ?
 
ఈ కబ్జాబావోతం వెనుకాల ఓ అధికార పార్టీ నాయకులున్నారని పలు అనుమానాలున్నాయి.అందుకే అటు వైపు అధికారులెవరు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
 గ్రామకమిటి ఆధ్వర్యంలో అధికారులకు పిర్యాదు...
 ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో లిఖితపూర్వకంగా అధికారులకు పిర్యాదు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇందుకు సంబంధించి వివరణ కోసం రెవెన్యూ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించగా వారు అందుబాటులోకి రావడం లేదు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాదారుల కానంద హస్తాల్లోని బూమిని కాపాడి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.