తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్
Published: Wednesday September 28, 2022
సెప్టెంబర్ 27, 2022 :
తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు, స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 127వ జయంతి వేడుకలలో పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ అలుపెరుగని పోరాటం చేశారని, రాజకీయ నాయకుడిగా, సంఘ సంస్కర్తగా, ప్రజల పక్షాన పోరాడిన మహనీయుడిగా సదా స్మరణీయుడని అన్నారు. 1915 సెప్టెంబర్ 27న ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో జన్మించారని, విద్యార్థి దశ నుండే స్వాతంత్య్రం కోసం పోరాడారని, 1940లో న్యాయవాద వృత్తి చేసేటప్పుడు బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారి తరఫున వాదించి కేసులను గెలిపించారని, 1942లో కిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. 1952లో ఆసిఫాబాద్ నుంచి ఎన్నికై హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించారని, తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేశారని, 1969, 2009-12 తెలంగాణ ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి బి. వినోద్కుమార్, రాజస్వ మండల అధికారి వేణు, మున్సిపల్ చైర్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, పద్మశాలి సంఘం జిల్లా నాయకులు గాదాసు బాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: