ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం ఐటీడీఏ పిఓ వరుణ్ రెడ్డి

Published: Saturday July 02, 2022
ఆసిఫాబాద్ జిల్లా జూలై 01(ప్రజాపాలన,ప్రతినిది) : జిల్లాలో ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ శుక్రవారం నుండి పూర్తిస్థాయిలో నిషేధించాలని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాత్ పాయి, జిల్లా అటవీ  శాఖ అధికారి దినేష్ కుమార్ తో కలిసి, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణం కలుషితమవుతుందని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జూలై 01నుండి 120 మైక్రాన్ కంటే తక్కువ ఉన్న అన్ని రకాల ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ వాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా వ్యాపారులు  వాటిని వాడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఐటీడీఏ పరిధిలో జరుగుతున్న పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సురేందర్, పంచాయతీ అధికారి రమేష్, ఈవో వంశీకృష్ణ, అన్ని రకాల అసోసియేషన్ల సభ్యులు పాల్గొన్నారు.