ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవారత్న అవార్డుల, బహుమతి ప్రధానోత్సవం

Published: Saturday August 27, 2022

శేరిలింగంపల్లి -ప్రజా పాలన /ఆగస్ట్ 26 :స్వాతి హైస్కూల్లో భారతరత్న నోబుల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిస్సా జయంతి ఉత్సవాన్ని శుక్రవారం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో రాగం మల్లికార్జున యాదవ్ సౌజన్యంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్ థెరిస్సా చిత్రపటానికి పుష్పాంజలితో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర ఆచార్యులు రాందాస్ విచ్చేసిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవగా భావించి, సమాజ సేవలో చురుకుగా పాల్గొంటున్నటువంటి, గచ్చిబౌలి సత్యసాయి సేవా సంస్థ సభ్యులు సి.శశికిరణ్, ఎం. దీప్తి గారు, కుమారి చందన, గ్రేస్ వృద్ధుల ఆశ్రమ నిర్వాహకుడు శ్రీనివాస్, అమ్మానాన్న వృద్ధాశ్రమం నిర్వాహకురాలు శ్రీదేవిలకు సేవారత్న అవార్డ్స్ అందజేస్తు, వేద మంత్ర ఆశీర్వాదాల మధ్య సాలువాతో ఘనంగా సత్కరించారు. తదనంతరం మరో ముఖ్య అతిథి విచ్చేసిన రాందాస్ మాట్లాడుతూ యుగోస్లేవియా దేశంలో పుట్టి, భారత దేశానికి ఉపాధ్యాయురాలిగా వచ్చిన మదర్ థెరిస్సా సామాజిక సేవల ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపును పొంది అందరికీ అమ్మ అయిందని తెలిపారు. కోల్ కత్తా మురికివాడలోని అభాగ్యుల జీవితాలలో వెలుగును నింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరీసా అని, తోటి వారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారిని వెతికి మరీ సాయం అందించిన గొప్ప మాతృమూర్తి అని అన్నారు. మదర్ థెరిసా సేవా తత్పరతను తన తండ్రి ద్వారా పునికిపుచ్చుకున్నారని అన్నారు. కలకత్తాలోని మురికివాడల్లో దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయి, ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి, మానవ సేవకు శ్రీకారం చుట్టారని అన్నారు. అనాధ పిల్లల కోసం పాఠశాలలను ఏర్పాటు చేసి, వారి పోషణకు తగిన నిధులు లేకపోవడంతో కోల్కత్తా నగరంలో జోలె పట్టి, అనాధ పిల్లల కడుపు నింపారన్నారు. ఆమె సేవా నిరతిని గుర్తించిన కొందరు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ఆర్థిక సాయం అందించి, ఆమెకు బాసటగా నిలిచారని తెలిపారు. దీనితో 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి, ఈ సంస్థ ద్వారా దాదాపు 45 ఏళ్లలో ఎందరో అభాగ్యులు, పేదలు రోగులకు సేవలు అందించారని, అనేక అనాధ శరణాలయాలు, ధర్మశాలలు, హెచ్ఐవి, కుష్టు వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి, తన సేవల ద్వారా స్వాంతన చేకూర్చారని తెలిపారు. మదర్ థెరిసాకు 1951లో భారత పౌరసత్వం లభించిందని, లక్షలాదిమంది ప్రజలు ప్రముఖ వ్యక్తులు ప్రభుత్వాలు అనేక సంస్థలు ఆమెను కీర్తించినప్పటికీ, విమర్శలను కూడా ఎదుర్కొని, వాటికి తన సేవ ద్వారా సమాధానం చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి మదర్ థెరీసా అని అన్నారు.1952లో కోల్కత్తాలో హోం ఫర్ ది డైంగ్ ని స్థాపించి, భారత ప్రభుత్వ సహాయ సహకారాలతో పాడుబడిన దేవాలయాలన్నీ ప్రజల ధర్మశాలలుగా మార్చి, వాటికి కాళీఘాట్ పరిశుద్ధ హృదయ నిలయం, నిర్మల హృదయాలయాలుగా నామకరణం చేసి, ఈ నిలయాలకు వచ్చే జీవితం చరమాంకదశలో ఉన్నవారికి, అనాథలకు, అభాగ్యులను చేరదీసి వారికి సేవలందించి వైద్య సహాయాన్ని అందించారని తెలిపారు. వారి నమ్మకాలు, మతాచారాల ప్రకారం వారి ఖర్మకాండలను జరిపించి, గౌరవంగా చనిపోయే అవకాశాన్ని కల్పించిన మహోన్నతురాలని అన్నారు. ఆమె సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1962లో పద్మశ్రీ, జవహార్ లాల్ నెహ్రూ అవార్డులవంటి అనేక అవార్డులతో సత్కరించారని, మదర్ థెరిసా తన సేవలను భారతదేశ వ్యాప్తంగాను, ఇతర దేశాలకు విస్తరించారన్నారు. సుమారు 123 దేశాలలో 610 కేంద్రాల ద్వారా తన సేవలను అందించారని, ఆమె సేవలను గుర్తించి 1979లో నోబుల్ శాంతి బహుమతికి ఎంపిక చేశారని, 1980లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదుతో సత్కరించిందని తెలిపారు. నేటి యువతీ యువకులు ఆమె యొక్క సేవా తత్పరతను ఆదర్శంగా తీసుకొని, వృద్ధులకు, సమాజంలో అభాగ్యులకు, నిరుపేదలకు, సేవలను అందించాలని కోరారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మానవసేవే మాధవసేవగా భావించే, సేవా తత్పరతను అలవాటు చేయాలని కోరారు. ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అని భావించి, ఎంతోమందికి ఆదర్శంగా నిల్చిన స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాగం మల్లికార్జున యాదవ్, స్వాతి స్కూల్ కరస్పాండెంట్ ఫణి కుమార్, సత్యసాయి సేవా సమితి సభ్యులు డా.బి.సి. రామన్న, డి.వి.కె రావు, కొత్తపల్లి కోటేశ్వరరావు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణు ప్రసాద్, కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వరరాజు, శివరామకృష్ణ, ఉమా చంద్రశేఖర్, శ్రీదేవి, అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.