వందల కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన తాసిల్దార్ గౌతమ్ కుమార్

Published: Friday August 13, 2021
కాప్రా కస్టోడియన్ ప్రభుత్వ భూములను కాపాడడానికి కదంతొక్కిన రెవెన్యూ అధికారులు
గురువారం తెల్లవారుజాము నుండే భారీ పోలీసు బలగాలతో కస్టడియన్ భూములు స్వాధీనం
 
 మేడిపల్లి ఆగస్టు12 (ప్రజాపాలన ప్రతినిధి ) కాప్రా పరిధిలోని సర్వే నెంబర్ 151, 152 లో గల కస్టోడియన్ భూములను, కాపాడడానికి కదం తొక్కిన కాప్రా తాసిల్దార్ కె గౌతమ్ కుమార్ రెవెన్యూ యంత్రాంగం. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండే ఆరు జెసిబి సహాయంతో కబ్జాకి గురైన కస్టోడియన్ భూమిని కబ్జాదారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను తొలగించి, ప్రభుత్వ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారి కోర్టుని తప్పుదోవ పట్టించిన, సదరు కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని పరిరక్షించడం కోసం, భారీ పోలీసు మరియు స్పెషల్ ఫోర్స్ బలగాలతో గురువారం ఉదయం నాలుగు గంటల నుండే కాప్రా రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా కాప్రా తాసిల్దార్ కె గౌతమ్ కుమార్ మాట్లాడుతూ, కాప్రాలోని కబ్జాలకు గురవుతున్న దాదాపు 13 ఎకరాలలో వందల కోట్ల విలువ చేసే కస్టోడియన్ ప్రభుత్వ భూమిని, కబ్జాదారుల చెర నుండి పరిరక్షించి ప్రభుత్వ సూచిక బోర్డులు ఏర్పాటు చేశామని అన్నారు. ఇకపై ప్రభుత్వ భూములపై కన్నేసి కబ్జాలకి పాల్పడుతున్న వారు, ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ స్థలాలలో కబ్జాదారుల మోసపూరితమైన మాటలను నమ్మి, అమాయకమైన ప్రజలు ప్లాట్లు కొని మోసపోవద్దని ఆయన  తెలిపారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కూల్చివేతలో కాప్రా తాసిల్దార్ కె గౌతమ్ కుమార్ తో పాటు, ఇంచార్జ్ ఆర్డిఓ మల్లయ్య,కుషాయిగూడ ఏసిపి శివ కుమార్,  డి ఐ మధు కుమార్, జవహర్ నగర్ సి ఐ,పి బిక్షపతి రావు, ఎస్సైలు మోహన్, సాయిలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శాలిని, రమేష్, వీఆర్వో సత్యనారాయణ, విజయ్ కుమార్, గంగాధర్, సర్వేయర్ ఇతర రెవెన్యూ సిబ్బంది, పోలీసు  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు