భార్యపై అనుమానం.. పిల్లలకు శాపం.. చివరకు భర్త కూడా

Published: Tuesday October 18, 2022
ప్రజాపాలన -శేరీలింగంపల్లి /అక్టోబర్17 న్యూస్ధు  :సమాజంలో భార్యాభర్తల సంబంధాలకు విలువ లేకుండా పోతుంది. ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కానీ పరిస్థితి. అభం శుభం తెలియని పిల్లలకు అది శాపంగా మారుతుంది. హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లలతో పాటు భార్యను హతమార్చాడో కిరాతక భర్త. చివరకు అతనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సంగారెడ్డికి చెందిన నాగరాజు(42) గత 7 సంవత్సరాల క్రితం భార్యా సుజాత (36), పిల్లలు సిద్దు(10), రమ్యశ్రీ (7)లతో కలసి నగరానికి వలస వచ్చి పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 18లో నివాసం ఉంటున్నారు. నాగరాజు టీవీఎస్ లూనాపై తిరుగుతూ కిరాణా షాపుల్లో మసాలాలు, ఇతర గృహావసర వస్తువులు సరఫరా చేస్తుంటాడు. అతని భార్య సుజాత ఇంటి దగ్గరే టైలరింగ్ పనిచేస్తూ డబ్బులు వడ్డీలకు ఇస్తూ ఉంటుంది. అయితే గత కొన్నాళ్లుగా నాగరాజు సుజాత దంపతుల మధ్య కలహాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిరోజులుగా అతను పనికి కూడా వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో భార్యా పిల్లలను చంపాలనుకున్న నాగరాజు ముందుగా భార్యా పిల్లలకు విషమిచ్చి, బ్రతికే ఉన్నారన్న అనుమానంతో టైలరింగ్ కత్తెరతో పొడిచి చంపాడు. అనంతరం తానూ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐతే నాగరాజుకి తన భార్యపై అనుమానం ఉండేది. ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు బావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.