జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి ** టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు గణపురం మహేష్ **

Published: Tuesday October 11, 2022
ఆసిఫాబాద్ జిల్లా అక్టోబర్ 10 (ప్రజాపాలన, ప్రతినిధి) : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు మంజూరు చేయాలని  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టిడబ్ల్యూజెఎఫ్) జిల్లా అధ్యక్షుడు గణపురం మహేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం " డిమాండ్స్ డే "లో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యుడు సురేందర్ రావ్, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ లతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయలేదని, దీనివల్ల అనేక మంది పేద జర్నలిస్టులు  ఇబ్బంది పడుతున్నారని వెంటనే అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ప్రస్తుతం జర్నలిస్టులకు ఇస్తున్న బస్ కూడా పూర్తి స్థాయిలో వర్తించడం లేదని, రైల్వే పాక్, బస్ పాక్, వంద శాతం రాయితీ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.  జర్నలిస్టులకు" జర్నలిస్ట్ బంధు పథకం " ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. రద్దు చేసిన రైల్వే పాటలు కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చిన్న పత్రికలకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు, ప్రభుత్వం వ్యాపార ప్రకటనల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ డిమాడ్స్ డే నిరసనకు "(టీయూడబ్ల్యూజే(ఐజేయూ)" సంఘం నాయకులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నీలి నితీష్, ఉపాధ్యక్షుడు ప్రకాష్, ట్రెజరర్ కృష్ణ మోహన్ గౌడ్, శ్రీనివాస్, రాజేశ్వర్, శ్రీధర్, జానకిరామ్, ఆడప సతీష్, బిక్కాజీ, రవి, తదితరులు పాల్గొన్నారు.