గ్రామాల అభివృద్ధిలో పురోగతి సాధింఛాలి : జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

Published: Monday July 05, 2021
వికారాబాద్ జూలై 04 ప్రజాపాలన బ్యూరో : గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, జిల్లా కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. ఏడో విడత హరితహారం, నాలుగో విడత పల్లెప్రగతి కార్యక్రమాల్లో భాగంగా నాల్గవ రోజైన ఆదివారం ధారూర్ మండలం గడ్డమీది గంగారాం గ్రామంలో పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమాల్లో పాల్గొని గ్రామంలో కలెక్టర్ మొక్కలు నాటారు. గ్రామాన్ని పరిశుభ్రంగా పచ్చదనంగా ఉంచేలా గ్రామంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామస్తులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. పల్లెలను పచ్చగా ఉంచడమే ధ్యేయంగా మొక్కలు నాటడం జరుగుతుందని వాటిని సంరక్షించేందుకు కృషి చేయాలని కోరారు. గ్రామంలోని ఎస్.సి కాలనీలో పర్యటించి శిథిలావస్థలో ఉన్న భవనాన్ని తొలగించి కొత్త భవనాన్ని నిర్మించుకొవాలని భవన యజమానికి సూచించారు. అదేవిధంగా గ్రామంలో ఇండ్లపై వేలాడే కరెంటు వైర్లను సరిచేయాలని, వంగిన, తుప్పు పట్టిన కరెంట్ స్తంభాలను తొలగించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. డ్రైనేజీలను పరిశీలించి మురికి తొలగించాలని, మరమ్మతులు చేపట్టి, అవసరమైన చోట కొత్త డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని సూచించారు. గ్రామంలో ఉన్న పాడుబడిన బావిని పరిశీలించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బావిపై జాలీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలోని రోడ్ల పై చెత్తను వేయరాదని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఇంటింటి నుండి తడి పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని పంచాయతీ సెక్రటరీ ని ఆదేశించారు. ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున కలెక్టర్ అందించారు. గ్రామంలో రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కుక్కింద గ్రామంలో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట సర్పంచ్ అమర్ నాథ్, జడ్పీటీసీ సుజాత, ఎంపిడిఓ ఉమాదేవి, డిఈఓ రేణుకా దేవి, డిఎల్ పి ఓ అనితా, తహాసీల్దార్ భీమయ్య, డి ఆర్ డి ఏ పిడి కృష్ణణ్, ఎపిఓ సురేష్, ఇంచార్జి పంచాయతీ సెక్రటరీ వేమారెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.