మండలంలో చెరువు మట్టి మాఫియాలను అరికట్టలేరా ఇరిగేషన్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఎటు మలుపు తిరు

Published: Monday July 04, 2022
బోనకల్,జూలై 03 ప్రజా పాలన ప్రతినిధి : మండలంలో అక్రమార్కుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి.విధుల్లో ఉన్న కొంతమంది అధికారులను అధికార పార్టీ అండదండలతోనో,లేకనో ఏదో ఒక రకంగా..తమకు అడ్డు లేకుండా అనుకూలంగా మార్చుకొని తమ వ్యాపారులు మూడు పువ్వులు ఆరకాయలుగా సాగిస్తూ వివిధ అక్రమ పనులకు తెరలేపుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజుల క్రితం రావినూతల చెరువులో ఇరిగేషన్ అమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్నారని ఇరిగేషన్ ఏఈ శాంతి శ్రీ  రావినూతల గ్రామానికీ చెందిన రెండు జెసిబిలను స్వాధీనం చేసుకోని పొలీస్ వారి సహాయంతో స్టేషన్ కు తరలించారు. జెసిబిలను స్వాధీనం చేసుకున్న అనంతరం గ్రామ రైతులు,జెసిబి యజమానులు అనుమతులు లేకుండా ఈసారి చెరువులో తవ్వకాలు జరపమని రాత పూర్వకంగా రాసిన అభ్యర్థన మేరకు ఇరిగేషన్ అధికారులు జెసిబిలను వదిలిపెట్టారు. పది రోజులు కాకముందే మరల శుక్రవారం అర్థరాత్రి సమయంలో అదే రావినూతల చెరువులో దర్జాగా అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తీ అండదండలతో మట్టిని తోడేస్తున్నారన్న  గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ ఏఈ చెరువు వద్దకు వెళ్ళగా సుమారు రెండు జెసిబి లు 100 ట్రాక్టర్లతో మట్టి త్రవ్వకాలు జరుపుతుండటంతో, జెసిబి ల యొక్క తాళాలు స్వాధీనం చేసుకోని 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.స్తానిక స్టేషన్ నుండి ఏఈ శాంతిశ్రీ కి ఫోన్ చేసిన పోలీసు అధికారులు తగినంత పోలీస్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సంఘటన స్థలానికి ఇప్పుడు రాలేమని శనివారం ఉదయం స్టేషన్కు వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని పోలీస్ వారు సూచించారు. సంఘటన జరిగిన మరుసటి రోజు శనివారం ఇరిగేషన్ ఏఈ శాంతి శ్రీ జెసిబీల యెక్క వివరాలతో పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.కానీ బోనకల్ ఎస్ఐ తేజావత్ కవిత ప్రధాని  హైదరాబాదు బందోబస్తు కార్యక్రమంలో ఉండటం వలన జెసిబిలను స్వాధీనపర్చుకోలేకపోయామని అందుబాటులో ఉన్న పోలీసు వారు తెలిపారు.రాబోయే రోజుల్లో ఈ కేసు ఎటు మలుపులు తిరుగుతుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
 
ఎన్ ఎస్పీ ఏఈ వివరణ......
చెరువు మట్టి తరలించేందుకు ఇప్పటి వరకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు.అందులో భాగంగానే మట్టి తరలింపును అడ్డుకున్నా మని,చెరువు మట్టి అక్రమంగా తరలిస్తున్న జెసిబి వారిపై చర్యలు తీసుకుంటామని ఏఈ శాంతిశ్రీ తెలిపారు.
 
గ్రామస్థులు......
 
 గ్రామ రైతులు ఎన్ఎస్పీ డీఈ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని.అనుమతులు ఉన్నాయని,ఎవరూ ఏమీ చేయలేరని అడిగిన వారితో ఘర్షణ పడుతున్నారని, నిబంధనలు తుంగలో తొక్కి మట్టి తరలించడంతో పాటు చెరువులో 25నుంచి 30 అడుగుల పైబడే గోతులు తీస్తున్నారని, అందులో గేదలు కానీ మనుషులు పడి చనిపోతరనివారు వాపోతున్నారు.
 
విధుల్లో ఉన్న మహిళ ఉద్యోగిని బెదిరించిన తెరాస ప్రజా ప్రతినిధి
 
అర్ధరాత్రి సమయంలో అక్రమ మట్టి తోలకాలు జరుపుతున్న జెసిబి ఆపటానికి వెళ్లిన  ఇరిగేషన్ ఏఈ శాంతిశ్రీని అదే గ్రామానికి చెందిన ఒక తెరాస ప్రజా ప్రతినిధి ఫోన్ చేసి జెసిబిలను ఆపడానికి నీకు ఏం అధికారం ఉంది,వదిలిపెట్టమని లేకపోతే నీ అంతు చూస్తామని, నువ్వు రాత్రీ సమయంలో కాలువల పై డ్యూటీ చేయాలని అది గుర్తుంచుకోవాలని, లేనియెడల మా ఊర్లో కుడా తిరగవని బెదిరించారు.