ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు ** జిల్లా ఎస్పీ సురేష్ కుమార్

Published: Saturday September 03, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 01 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఈనెల 4వ తేదీన సింగరేణి సంస్థ లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నిర్వహించబోయే పరీక్షలకు అభ్యర్థులు సింగరేణి సంస్థ వారు సూచించే నియమ నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువత అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఇప్పటికే కొంతమంది వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సులభంగా వారిని మోసం చేస్తున్నారని, అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే ఉద్దేశంతో తమ వద్దకు వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మోసాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.