ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పని సరిగా వేసుకోవాలి : కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

Published: Friday August 13, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడా గల ప్రభుత్వ పాఠశాల లో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ వాక్సినేషన్ సెంటర్ ను గురువారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక నాయకులు తో కలిసి సందర్శించారు. అనంతరం వాక్సినేషన్ ప్రక్రియను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పని సరిగా వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాని వాళ్లకు ఈ మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాక్సిన్ ను స్థానికంగా ఉన్న కమిటీ హాల్లు, ఫంక్షన్ హాల్లు, స్కూళ్ళలో అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. వ్యాక్సిన్ వేసుకునేందుకు దూరం వెళ్లకుండా ప్రజలకు చేరువగా అనేక సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నాము అన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించడమే ధ్యేయంగా వాక్సినేషన్ విషయంలో ప్రత్యేక దృష్టి చేస్తున్నాము అన్నారు. ఈ సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎక్కువ సేపు లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఉదయం 10 గంటల నుంచి ఒక్కో మొబైల్‌ సెంటర్‌ ద్వారా రోజుకి 350 నుంచి 400 మందికి వ్యాక్సిన్ వేస్తారని అన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ సెంటర్ లు ఉంటాయని, వ్యాక్సిన్ కోసం వచ్చిన వారు ఆధార్ వివరాలు తెలిపి వాక్సిన్ వేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వని, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు, శివ సింగ్, దేవేందర్ రెడ్డి, సంతోష్ సింగ్, గోపాల్, మన్నే రమేష్ జి.హెచ్.ఎం.సి శానిటేషన్ సూపర్వైజర్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.