పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు అనుమతించాలని వినతి

Published: Tuesday August 03, 2021
మేడిపల్లి, ఆగస్టు 2 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు అనుమతించాలని టెక్నికల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బేేేతి సుభాష్ రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం నాడు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మర్యాదపూర్వకంగా నవీన్ మిట్టల్ ను కలిసి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉప్పల్ నియోజకవర్గానికి మంజూరు చేసిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీని రామంతాపూర్లోని పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణంలో ఏర్పాటుకు అనుమతించాలని విన్నవించారు. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీ పరిసర కాలనీలకు చెందిన సీనియర్ సిటిజెన్స్ వాకింగ్ చేసుకునేందుకు అనుమతించాలని కోరారు. అందుకుగాను కమిషనర్ నవీన్ మిట్టల్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డం రవి కుమార్, గరికె సుధాకర్, పళ్ళ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.