వికారాబాద్ అసెంబ్లీ బిఎస్పి ఇన్చార్జ్ పెద్ది అంజయ్య

Published: Saturday July 23, 2022

వీఆర్ఏల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి 

వికారాబాద్ బ్యూరో 22 జూలై ప్రజా పాలన : వీఆర్ఏల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని వికారాబాద్ అసెంబ్లీ బీఎస్పీ ఇన్చార్జ్ పెద్ది అంజయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరుగుతున్న వీఆర్ఏల ధర్నా కార్యక్రమానికి మద్దతుగా బీఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ పెద్ది అంజయ్య పాల్గొని వారికి బిఎస్పి పార్టీ మద్దతుగా ఉంటుందని భరోసా కల్పించారు. వీఆర్ఏల డిమాండ్లు న్యాయమైనవని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో వీఆర్ఏలు చేస్తున్న ధర్నా కార్యక్రమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉద్యోగస్తులను సామాన్య ప్రజలను నిరుద్యోగులను కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన నాయకులు అధికారం వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలు, సెటిల్మెంట్లు చేయడం తప్ప ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితిలో లేరని దెప్పి పొడిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడానికి వీఆర్ఏల పాత్ర కీలకంగా ఉందని అలాంటి ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప వీఆర్ఏల సమస్యలు గానీ నిరుద్యోగుల సమస్యలు గానీ పరిష్కరించబడవని ఆరోపించారు.