మా పొలాలకు దారి చూపండి మహాప్రభో...! * కొన్న భూమి వెనకాల ఉన్న రైతులకు దారి వదులుతామని హామీ * భూమి క

Published: Friday August 05, 2022
వికారాబాద్ బ్యూరో 04 ఆగస్టు ప్రజా పాలన : మా తాత ముత్తాతల నుండి భూమిని నమ్ముకొని జీవిస్తున్నాం. పొలాలకు వెళ్లాలంటే ఒకరి పొలంలో నుండి మరొకరి పొలాలకు వెళ్లేవాళ్లం. ఆనాటి నుండి నేటి వరకు పొలాలకు వెళ్లేందుకు దారి వదులుకున్నాం. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న భూ యజమానులు తమ భూములను విక్రయించారు. భూములను విక్రయించే ముందు మా పొలాల వెనుక ఉన్న రైతులకు దారి తప్పనిసరిగా వదలాలని నోటి మాటగా హామీ తీసుకొని విక్రయించారు. భూమి కొన్న వ్యక్తి రాజేశ్వరరావు తప్పనిసరిగా మేము కొన్న భూమికి వెనకాల ఉన్న రైతులకు దారిని వదులుతానని హామీ ఇచ్చారు. కానీ లిఖితపూర్వకంగా రాసుకోలేదు. భూమి కొన్న వ్యక్తి రాజేశ్వరరావు అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో మృతుని భార్య భద్రమ్మ ప్లేటు ఫిరాయించి మొత్తం మేమే కొన్నామని దారి వదలమని రైతులను బెదిరిస్తున్నారని మూలమాడ గ్రామ రైతులు ఆరోపించారు. మృతుడు రాజేశ్వరరావు కొన్న భూములకు దారి వదలమని ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న భూ యజమాని పాపిరెడ్డి తెలిపారు. ఈ విషయమై భద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  సర్వే నెంబర్లు 76,79, 80, 81లో మొత్తం 24 ఎకరాల 27 గంటల భూమిని నగరానికి చెందిన భద్రమ్మ రాజేశ్వరరావు అనేవారు గతంలో కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు.ప్రధాన రోడ్డును అనుకోని ఉన్న సర్వే నెంబర్ 88లో ఒక గుంట భూమిని పాపిరెడ్డి కొన్నాడని తెలిపారు.అయితే భద్రమ్మ కొన్న భూమిలోకి వెళ్లాలంటే పాపిరెడ్డి కొన్న ఒక గుంట భూమి నుంచి వెళ్లవలసి ఉంటుందని దానిని కూడా భద్రమ్మ కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. పాపి రెడ్డికి ఒక గుంట భూమి పట్టా ఉంటే పత్రాలు చూయించాలని భద్రమ్మ వారిని బెదిరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇట్టి భూమి విషయంలో ఓ మంత్రి కలగజేసుకొని ఆ భూమి విషయంలోకి రైతులు వెళ్లకుండా చూడాలని మూలమాడ సర్పంచ్ సుభాన్ రెడ్డికీ ఫొన్ చేసి భూ సమస్య పరిష్కరించాలని హెచ్చరించారని సర్పంచ్ తెలిపారు. ఈ భూమి విషయంలో కొందరిపై వికారాబాద్ పోలీస్ స్టేషన్లో కొందరిపై కేసు నమోదు కావడం వారికి స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వడం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  భూ విషయంలో పోలీసులు కలగజేసుకోవడం ఏంటని రైతులు మండిపడుతున్నారు. భద్రమ్మ భూమి వెనకాలే మూలమాడ, నారాయణపూర్ గ్రామాల రైతులకు సంబంధించిన 30 ఎకరాల భూమి ఉందని మా తాతల కాలం నాటి నుంచి అదే భూమిలో నుండి నడుస్తున్నామని మా దగ్గరే భూమిని కొనుగోలు చేసి మమ్మల్ని వెళ్లకుండా ఇబ్బంది పెడుతున్న భద్రమ్మ పై అధికారులు చర్యలు తీసుకోవాలని రైతుల కోరుతున్నారు. 
వికారాబాద్ పట్టణ సీఐ టి శ్రీనివాస్ వివరణ : పొలానికి వెళ్లే దారిని రైతులు తవ్వేశారని భూ యజమాని ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమే. కేసు నమోదు చేసి విచారణ జరపనున్నామని సీఐ తెలిపారు.