రైతు బిచ్చిరెడ్డి కుటుంబానికి ఆర్థిక అండ : చేవెళ్ళ ఎంపి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి

Published: Thursday September 16, 2021
వికారాబాద్ బ్యూరో 15 సెప్టెంబర్ ప్రజాపాలన : అకాల వర్షాలతో పంట నష్టపోయి అప్పుల బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బుచ్చిరెడ్డి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశామని చేవెళ్ళ ఎంపి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం ఇంటిల్లిపాది కష్టపడితే గానీ చేతికి పంట రాదని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా పంటలు పూర్తిగా నాశనం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి వ్యవసాయం చేసే రైతన్నల పాలిట ఎడతెరిపిలేని వర్షాలు మరణ మృదంగాన్ని శాసిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. తమ పిల్లలను పెంచి పోషించే వారు చనిపోతే పిల్లలు దిక్కులేని వారవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన బిచ్చిరెడ్డి అనే యువ రైతు కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే వారి పిల్లల చదువు, భవిష్యత్తు కు తన వంతు సాయం చేస్తానని హమీ ఇచ్చారు. బంట్వారం మండలంలో రైతు వేదిక ప్రారంభించడానికి వచ్చిన ఎంపీ  మొదట నేరుగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న యాచారం గ్రామానికి చెందిన రైతు ఇంటికి వెళ్లి మృతుని చిత్ర పటానికి పూలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి పిల్లలను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ఎంపీ వెంట స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వున్నారు.