నేడు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ బోనకల్ కు రాక

Published: Tuesday September 06, 2022

 బోనకల్, సెప్టెంబర్ 5 ప్రజా పాలన ప్రతినిధి:  జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ మంగళవారం బోనకల్ కు రానున్నారు. ఆర్ఓ బ్రిడ్జి కింద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదవ విడత పల్లె ప్రగతిలో భాగంగా బోనకల్ సర్పంచ్ భూక్య సైదా నాయక్ కృషితో త్వరితగతిన జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నట్లు తెలిసింది.నాడు బోనకల్ పర్యటనకు పలుసార్లు వచ్చిన కలెక్టర్  మండల కేంద్రంలోని ఆర్వో బ్రిడ్జి క్రింద ప్రయాణికులు, ఈ ప్రాంత వాసులకు ఉపయోగపడే విధంగా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. అందులో భాగంగా బ్రిడ్జి క్రింద పిల్లర్ల మధ్య భాగంలో ప్రయాణికుల సౌకర్యార్థం కూర్చునేందుకు బల్లలు, చిన్నారులకు ఆట స్థలం, ఫ్రీడమ్ ఫార్క్ ద్వారా  పలు రకాల పూల మొక్కలు, మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. పిల్లర్ల గోడలపై ప్రజలను ఆకట్టుకునే  విధంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా కళా చిత్రాలను ప్రజలకు ఆకట్టుకునే విధంగా చిత్రించారు. వీటన్నింటిని కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించనున్నారు.