అత్వెల్లిలో ప్రధాన సమస్యలను పరిష్కరిద్దాం * వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Thursday August 25, 2022
వికారాబాద్ బ్యూరో 24 ఆగస్టు ప్రజా పాలన : అట్వెల్లి గ్రామంలోని ప్రధాన సమస్యలను ముందుగా పరిష్కరిద్దామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలోని అథ్వెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మోహన్ కార్యదర్శి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *"మీతో నేను"* కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటల నుండి 11:30 వరకు పర్యటించారు.గ్రామంలో 8 మరియు 10వ వార్డులలో మిగిలిపోయిన ఇళ్లకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇవ్వాలని పేర్కొన్నారు. నెలకు మూడు సార్లు వాటర్ ట్యాంక్ ను కచ్చితంగా శుభ్రం  చేయాలని స్పష్టం చేశారు. ఎక్కడ కూడ లీకేజీలు లేకుండా చూడాలని తెలిపారు. ప్రజలు మిషన్ భగీరథ నీటినే త్రాగాలన్నారు. అందుకు మిషన్ భగీరథ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రత్యామ్నాయంగా గ్రామంలో చేతి పంపులు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో పనిచేస్తున్న విద్యుత్ లైన్ మేన్ వీరేశం ప్రజలకు అందుబాటులో ఉండడని ప్రజలు తెలుపగా... ఎమ్మెల్యే లైన్ మేన్ కచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి సర్వీస్ అందించాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో లేడు అనే సమస్య మళ్ళీ పునరావృతం కారాదన్నారు. పంటపొలాల్లో మరియు గ్రామంలో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, రోడ్డుకు మధ్యలో ఉన్న స్థంబాలను తొలగించాలని చెప్పారు. పంటపొలాలకు నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం చేయాలన్నారు. అంగన్వాడీ మరియు ఏఎన్ఎం ఆశా వర్కర్లు ప్రజలకు సరైన పద్దతిలో సేవలు అందించాలని సూచించారు. ఏఎన్ఎం మాణిక్యమ్మ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి సేవలను అందిస్తోందని ప్రజలు తెలుపగా... ఎమ్మెల్యే ఆమెను అభినందించారు.
 ప్రభుత్వ  ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గణితం బోధించే ఉపాద్యాయుడు లేడని ప్రజలు తెలుపగా... ఎమ్మెల్యే  డిఈఓ రేణుకతో ఫోన్లౌ మాట్లాడి బోధన విధానంలో కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. వారంలో ప్రతి శనివారం గ్రామపంచాయతీ ఆవరణలో రైతులకు పశువుల డాక్టర్ అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారి ఏఈఓ మట్ట ప్రతిభ రైతులకు అందుబాటులో ఉండి మంచి సేవలు అందిస్తుందని ప్రజలు తెలుపగా... ఎమ్మెల్యే ఏఈఓను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఫాతిమా ఎంపీటీసీ కొండి రాములు టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కైలా ఉపేందర్ రెడ్డి ఏఎంసి వైస్ చైర్మన్ మేక చంద్రశేఖర్ రెడ్డి టిఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు పులుమద్ది గయాజ్ ఏఎంసీ డైరెక్టర్ సోమిరెడ్డి ఎంపీడీవో సత్తయ్య ఎంపీ ఓ నాగరాజు టిఆర్ఎస్ గ్రామ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి బుచ్చి లింగం ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.