యాసంగి సీజన్లో వరికి బదులు ఆరుతడి పంటలు పండించాలి

Published: Tuesday December 07, 2021
వికారాబాద్ బ్యూరో 06 డిసెంబర్ ప్రజాపాలన : యాసంగి సీజన్లో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు పండించుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల రైతులను కోరారు. సోమవారం పరిగి మండలం సుల్తానుపూర్ లో వ్యవసాయ  అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులతో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ, ఈ యాసంగి సీజన్ లో రైతులు ఉత్పత్తి చేసిన వరి ధాన్యాన్ని భారత ప్రభుత్వం ఎఫ్.సి.ఐ ద్వారా కొనడం లేదని అన్నారు. అందువల్ల యాసంగి సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని తెలిపారు. వరి పంటలు వేసి రైతులు నష్టపోవద్దని తెలిపారు. ఈ యాసంగి సీజన్లో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకొని లాభం పొందాలన్నారు.  వ్యవసాయ అధికారులందరూ సోమవారం నుండి ప్రతి గ్రామంలో ప్రతి రైతును కలిసి యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.