మాతా, శిశు కేంద్రాన్ని జనవరి 5 లోగా ప్రారంభించాలి జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మంచిర్యా

Published: Friday December 30, 2022

మాతా, శిశు కేంద్రాన్ని జనవరి 5, 2023 లోగా ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల మాతా శిశు కేంద్రాన్ని ట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి ఆసుపత్రిలో వార్డులు, ల్యాబ్, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాతా, శిశు వుల సంరక్షణ కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి జిల్లాలో నిర్మించిన మాతా శిశు కేంద్రం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని, గర్భిణులకు ప్రసవం ఇంటి వద్ద కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన మాతా, శిశు కేంద్రం ద్వారా గర్భిణులు, పసిపిల్లల సంరక్షణ కొరకు కృషి చేయడంతో పాటు గర్భిణులకు క్రమం తప్పకుండా అవసరమైన పరీక్షలు నిర్వహించి కాన్పులు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డా. అరవింద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.