రజకులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి.* - ఫైళ్ళ ఆశయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్.
Published: Thursday November 10, 2022
మంచిర్యాల టౌన్, నవంబర్ 09,ప్రజాపాలన : రజకులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని
తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ దావనపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన బుధవారం నీలకంఠేశ్వర ఆసుపత్రి లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఆశయ్య హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలు రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని సామాజిక ,ఆర్థిక, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రజకుల పైన కుల వివక్షత, సామాజిక పీడన, దాడులు,దౌర్జన్యాలు పెత్తందారులచే గురవుతున్నారని రజకుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సామాజిక భద్రత రక్షణ చట్టం కల్పించాలని డిమాండ్ చేశారు. రజక ఫెడరేషన్ ద్వార రుణాలు అందించడం లో ప్రభుత్వం విఫలం అయింది అని విమర్శించారు. జీ.వో 190 ద్వారా దరఖాస్తు చేసినటువంటి రజక వృత్తిదారులకు వెంటనే లక్ష రూపాయల రుణం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, తదితర మున్సిపాలిటీలలో మోడరన్ ధోబి ఘాట్లు నిర్మించి వృత్తిదారులకు ఉపాధి కల్పించాలని, 50 ఏళ్లు నిండిన రజక వృత్తిదారులకు పెన్షన్, ఉచిత భీమా పథకం ప్రవేశాపెట్టాలని కోరారు.జిల్లా వ్యాప్తంగా ఐదువేల మంది పైన ఉచిత విద్యుత్తు పథకం ద్వారా లాండ్రీ షాపులు లబ్ధి పొందుతున్నారని ఇటీవల విద్యుత్ అధికారుల వేధింపులతో కరెంట్ బిల్లు కట్టాలని లేనియెడల కనెక్షన్స్ రద్దు చేస్తామంటూ బెదిరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఉచిత విద్యుత్ పథక సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేసి ఉచిత విద్యుత్ సక్రమంగా అమలు చేయాలని, సింగరేణి సంస్థ ద్వారా రజక యువకులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పయిరాల రాములు
ముష్క చందు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: