మునుగోడు అభివృద్ధి తెరాసతోనే సాధ్యం --ఆర్మూర్ శాసనసభ్యులు జీవన్ రెడ్డి

Published: Tuesday October 18, 2022
చౌటుప్పల్, అక్టోబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి):
18 కోట్ల రూపాయలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారని ఆర్మూర్ శాసనసభ్యులు జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో టిఆర్ఎస్ చౌటుప్పల్ మండలపార్టీ అధ్యక్షుడు గిర్కాటి నిరంజన్ గౌడ్ ఆధ్వర్యంలో తెరాస గెలుపుకై జీవన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కేసీఆర్ తీసుకొస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మునుగోడు ప్రజలు చైతన్యవంతులని గత మూడున్నర సంవత్సరాల కాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత లాభం కోసం మునుగోడు అభివృద్ధిని మరిచి బిజెపికి అమ్ముడుపోయారన్నారు. కేంద్రంలో బిజెపి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో దేశంలో పేద మధ్య తరగతి కుటుంబాలు బ్రతకలేని స్థితికి దిగజార్చారన్నారు. అటువంటి పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ ప్రజలు సైతం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. కెసిఆర్ తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఊరటనిస్తున్నాయన్నారు. మునుగోడులో ప్రజలు తెరాస తోనే అభివృద్ధి సాధ్యపడుతుందని తెలుసుకున్నారన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమైనట్లేనని, ప్రజలు అత్యధిక మెజారిటీ ఇచ్చి మునుగోడు అభివృద్ధికి దోహదపడతారన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మస్తాన్ బాబు, సర్పంచ్ వెల్వర్తి యాదగిరి, ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ మల్కాజిగిరి కృష్ణ, ఆందోల్ మైసమ్మ దేవస్థానం చైర్మన్ సిద్దిపేట శేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు రాంప్రసాద్, సాయికిరణ్, వెంకటేష్, బల్వంత్ రెడ్డి, కృష్ణ, యూత్ అధ్యక్షులు నరసింహ, యూత్ సెక్రెటరీ శ్రీశైలం, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.