మోడీ విదేశాల్లో సెటిల్ అవుతారు.. : లాలు ప్రసాద్ యాదవ్

Published: Monday July 31, 2023

 రాష్ట్రీయ జనతా దళ్ ప్రెసిడెంట్, బిహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్.. ప్రధాని మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోనున్నామనే ఆందోళనలో ఉన్నారని, అందుకే విదేశాల్లో ఆశ్రయాల కోసం వెతుకులాటలో ఉన్నారని పేర్కొన్నారు.

విపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు సంధించారు. ఈస్టిండియా కంపెనీలో, ముజాహిదీన్ ఇండియాలోనూ ఇండియా అనే పదం ఉన్నదని పేర్కొన్నారు. క్విట్ ఇండియా అనే కామెంట్ కూడా వాటిని ఉద్దేశించి ప్రధాని చేశారు. అవినీతి, బంధుప్రీతి, సంతుష్టివాద రాజకీయాలు చేసే కొత్త కూటమి ‘ఇండియా’ ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్‌ను కోరగా.. ఆయన ప్రధాని మోడీపై ఛమత్కారంగా మాట్లాడారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంలో మోడీ ఉన్నారని లాలు యాదవ్ పేర్కొన్నారు. ‘ప్రధాని మోడీనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్లాన్‌లు వేసుకుంటున్నారు. ఆయన అనేక దేశాలు తిరగడం వెనుక కారణం ఇదే. ఆయనకు అనుకూలించే, పిజ్జాలు మోమోలతో ఎంజాయ్ చేసే ఏరియా కోసం ఆయన వెతుకుతున్నారు’ అని లాలు ప్రసాద్ యాదవ్ అన్నారు.