Home తాజా వార్తలు భగ్గుమంటున్న దామగుండం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

భగ్గుమంటున్న దామగుండం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
భగ్గుమంటున్న దామగుండం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • రాడార్ స్టేషన్ నిర్మాణ ముహూర్తం ఖరారు
  • దామగుండంలో నేడు శంకుస్థాపన
  • ఇప్పటికే వ్యతిరేకిస్తున్న పలు వర్గాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఓవైపు భారత నావికాదళం 14 ఏండ్ల పోరాటం.. మరోవైపు పర్యావరణ సంస్థల వ్యతిరేకత కారణంగా దామగుండంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారత నావికాదళం 14 ఏళ్ల ప్రయత్నాలు- నేడు తీరుతున్నాయి. వికారాబాద్ జిల్లా పూడూరు వారు దామగుండం ప్రాంతంలో భారత నావికాదళం నిర్మించనున్న వీఎల్‌ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణ ముహూర్తం కుదిరింది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రాడార్ స్టేషన్ నిర్మాణం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గత 14 ఏళ్లుగా ఈ రాడార్ స్టేషన్ నిర్మాణానికి నావికాదళం ప్రయత్నాలు చేస్తోంది. 2010 నుంచి 2023 వరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ విషయంపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఆయన సమక్షంలోనే ఈ ఏడాది జనవరి 24న రిజర్వు ఫారెస్ట్‌లోని 2,900 ఎకరాలను అధికారులు నావికా దళానికి అప్పగించారు. దీంతో రాడార్ స్టేషన్‌కు అవసరమైన భూములు అందుబాటులోకి రావడంతో నేడు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేశారు.

హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామగుండంలోని ప్రాంతం మొత్తం 3 వేల 260 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. నగరం నుంచి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చిపోతుంటారు. ఈ ప్రాంతంలో చాలా వరకు సినిమా షూటింగ్‌లు కూడా జరుపుకున్నాయి. ఈ అడవిని ఆనుకొని సుమారు 20 వరకు చిన్న పల్లెలు, తండాలున్నాయి. పశువుల మేత, ఇతరత్రా అవసరాలకు స్థానిక ప్రజలు ఈ అడవిపై ఆధారపడతారు. అడవి మధ్యలో చిన్న చిన్న నీటివనరులు, వాగులు వంకలున్నాయి. ఎంతో అహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. పెద్ద జంతువులేవీ లేకపోయినా రకరకాల పక్షులు, జింకలు, దుప్పులు కనిపిస్తాయి. ఇక్కడ అనేక మొక్కలు ఉండటంతో చాలా మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో నిత్యం అన్వేషణ సాగిస్తారు.

అందుకే వ్యతిరేకత

ఇలాంటి ఈ ప్రాంతంలోని భూముల్లో 2900 ఎకరాలు నేవీకి అప్పగించారు. ఆ భూముల్లో లక్ష 93 వేల చెట్లున్నట్లు పేర్కొన్నారు. మరో 300 నుంచి 400 ఎకరాల్లో గడ్డి భూములున్నాయి. నేవీకి అప్పగించిన భూముల్లోని చెట్లను పూర్తిగా తొలగించబోమని అధికారులు చెబుతున్నారు. అవసరమైతే తొలగించాల్సిన చెట్లను వేళ్లతో సహా పెకిలించి గడ్డిభూముల్లో నాటాలని దుకాణ శాఖ అధికారులు అంచనా వేశారు. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ఈస్టర్న్ నావల్ కమాండ్ దామగుండంలో వీఎల్‌ఎఫ్ రాడార్‌ను నిర్మించబోతుంది. వీఎల్ఎఫ్ అంటే వెరీలో ఫ్రీక్వెన్సీ రాడార్ అంటారు. ఈ రాడార్ వ్యవస్థ ద్వారా సముద్రంలో ఉన్న ఓడలు, జలాంతర్గాముల్లోని సిబ్బందితో పంచుకోవచ్చు.

ఈ వ్యవస్థ 3 కేజీహెచ్‌జడ్‌ నుంచి 30 కేజీహెచ్‌జడ్‌ రేంజ్‌లో తరంగాలను ప్రసారం చేస్తోంది. నీటిలో 40 మీటర్ల లోతు వరకు ఈ తరంగాలు వెళ్తాయి. అలాగే ఈ వ్యవస్థ వెయ్యి దూరంలో ఉన్న వాటికి సిగ్నల్స్ చేరవేయగలదు. రక్షణ రంగంతోపాటు ఇతర రేడియో కమ్యునికేషన్ అవసరాల కోసం ఈ సాంకేతికతను వినియోగిస్తారు. దేశంలో రెండో అతిపెద్ద స్టేషన్. ఒకటి తమిళనాడులోని తిరునల్వేలో ఉండగా ఇప్పుడు దామగుండంలో రెండో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సముద్రం లేని తెలంగాణలో నేవి రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన ఆరేబియా సముద్రంలో ఉన్న ఓడలు, జలాంతర్గాముల్లోని సిబ్బందితో మాట్లాడటానికి వీలుగా ఈ రెండు ప్రాంతాలకు మధ్యలో ఉన్న తెలంగాణలోని దామగుండం ప్రాంతాన్ని నేవీ ఏంచుకుంది. సముద్ర మట్టానికి 360 ఎడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతం కావడం, హైదరాబాద్‌కు 60 దూరంలో ఉండడం దీనికి ప్రధాన కారణమని నేవి అధికారులు చెబుతున్నారు.

దామగుండం రిజర్వు ఫారెస్ట్‌లో రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని పలు పర్యావరణ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. పచ్చదనం, జీవ వైవిధ్యంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ, ఈసీ నదులు ప్రమాదంలో పడతాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగరానికి వరద ముంపు కూడా ఉండబోతుందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలకు లేఖలతోపాటు న్యాయస్థానాల్లో అనేక కేసులు దాఖలయ్యాయి. మరోవైపు ఈ స్టేషన్‌కు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు కూడా దశాబ్దకాలంగా దామగుండం సంరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సుమారు 2500 కోట్ల రూపాయలతో ఈ రాడార్ స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు ఉంది. 2027 నాటికి ఈ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నేవీ అధికారులు తెలిపారు.

మేధావుల లేఖలు

దామగుండం నేవీ రాడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయవద్దంటూ వివిధ మేధావులు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. అడవి స్వతంత్ర ప్రజా పోరాట యాత్ర, తెలంగాణ సేవ్ దామగుండం ఫారెస్ట్ ఫోరం, పర్యావరణ ప్రేమికులు, మేధావులు మొత్తం 44 మందితో పర్యావరణ, నివాస, వాతావరణ మంత్రిత్వ శాఖ, కేంద్రమంత్రి, సీఎంకు లేఖ రాశారు. ప్రజాభిప్రాయాలు తీసుకోకుండా అడవిని తొలిగించడాన్ని తప్పుపట్టారు. మరోవైపపు దామగుండంలో 12 లక్షల చెట్లను నరికివేస్తున్నారని పర్యావరణ కార్యకర్తలు నిరసనకు దిగారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech